Congress | హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్లో కమిటీల చిచ్చు పుట్టింది. ఇటీవల ఏర్పాటుచేసిన పలు కమిటీల్లో చోటు దక్కకపోవడంపై తెలంగాణ సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీపై అలిగి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల కాంగ్రెస్ అధిష్ఠానం సీడబ్ల్యూసీతోపాటు పలు కమిటీలను ప్రకటించింది. ఇందులో ఒక్క రాష్ట్ర ఎన్నికల కమిటీలో పలువురు సీనియర్లకు స్థానం కల్పించిన అధిష్ఠానం కీలకమైన సీడబ్ల్యూసీ, స్క్రీనింగ్ కమిటీ, ఎన్నికల కమిటీలో మాత్రం రాష్ర్టానికి చెందిన సీనియర్ నేతలను పట్టించుకోలేదు.
ఈ కమిటీల్లో స్థానం దక్కుతుందని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, వీ హనుమంతరావు, జానారెడ్డి, సీతక్క, చిన్నారెడ్డి వంటి వారు భావించారు. కానీ అధిష్ఠానం మొండిచేయి చూపించింది. అదే సమయంలో ఉత్తమ్కుమార్రెడ్డి దాదాపు అన్ని కీలక కమిటీల్లో స్థానం పొందడంతో వీరంతా అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. దీనిని అవమానంగా భావించిన కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, చిన్నారెడ్డి వంటి నేతలు పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో రంగంలోకి దిగిన కాంగ్రెస్ పెద్దలు ఇప్పటికే చిన్నారెడ్డిని బుజ్జగించి, ఇప్పుడు కోమటిరెడ్డిని సముదాయించేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.