హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): నివారింపదగిన అంధత్వ రహిత తెలంగాణ సాధన కోసం సీఎం కేసీఆర్ ప్రారంభించిన రెండో విడత ‘కంటి వెలుగు’ కార్యక్రమం వంద రోజులకు చేరువవుతున్నది. శుక్రవారం నాటికి 94 పని దినాల్లో రాష్ట్రవ్యాప్తంగా 1.60 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 15 జిల్లాల్లో శిబిరాలు పూర్తయినట్టు అధికారులు తెలిపారు. దృష్టిలోపం ఉన్న 22.44 లక్షల మందికి ఉచితంగా రీడింగ్ గ్లాసెస్, 15 లక్షల మందికి ప్రిస్కిప్షన్ గ్లాసెస్ పంపిణీ చేశారు.
అవసరమైన ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేయాలి
సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా కంటి వెలుగును విజయవంతంగా నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి, సహకరిస్తున్న ఇతర శాఖలు, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు. గడువులోగా మిగిలిన జిల్లాల్లోనూ పరీక్షలు పూర్తి చేయాలి. అవసరమైన ప్రతి ఒకరికీ వైద్యసిబ్బంది పరీక్షలు చేయాలి. వెంటనే రీడింగ్ గ్లాసెస్ ఇవ్వటంతోపాటు, నిర్దేశించిన సమయంలో ప్రిసిప్షన్ గ్లాసెస్ అందజేయాలి.
– మంత్రి హరీశ్రావు