ఆర్కేపురం(రంగారెడ్డి) : తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు ఉండే విధంగా సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన ప్రణాళికలు సత్ఫలితాలనిస్తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి(Minister Sabita Indra Reddy) పేర్కొన్నారు. సీఎం కేసీఆర్(CM KCR) నేతృత్వంలోని తొమ్మిదేండ్ల పాలనలో కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి జరిగిందని వెల్లడించారు.
శుక్రవారం తెలంగాణ ఆవిర్భావ వేడుకలను సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై స్టేడియం వద్ద ఉన్న అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజారంజక పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. సంక్షేమ రంగంలో తెలంగాణ దేశానికి నెంబర్వన్గా నిల్చిందని అన్నారు.
నిరంతరం ప్రగతిశీల (Progressive) రాష్ట్రంగా తెలంగాణ యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుందని తెలిపారు. సామాజిక న్యాయం కోసం సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, ఎమ్మెల్సీలు బొగ్గారపు దయానంద్గుప్తా, యెగ్గే మల్లేశం,రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్, అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ శ్రీధర్, రాచకొండ సీపీ డీఎస్ చౌహన్, శంకరమ్మ, సరూర్నగర్ తహసీల్దార్ జయశ్రీ తదితరులు ఉన్నారు.