వికారాబాద్ : రైతు బంధు పథకం దేశానికే ఆదర్శమని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మోమిన్ పేట్ మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో రైతుబంధు నగదను రైతుల ఖాతాల్లో వేయడంతో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కరోనా కష్టకాలంలో రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రైతు బంధు పథకం కొనసాగుతుందన్నారు.
రానున్న రోజుల్లో దాదాపు 63.25 లక్షల రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ ఎల్లవేళలా రైతుల సంక్షేమం కోసం ఆలోచిస్తారు అని గుర్తుచేశారు.
రైతు బంధు, రైతు బీమా, ఉచిత విత్తనాలు, యాంత్రీకరణ పనిముట్లు, పంట దిగుబడి కొనుగోలు ఇలా ఎన్నో ఆదర్శవంతమైన పథకాలు ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఏ పథకంలోనూ మధ్యవర్తులు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, ఎంపీపీ వసంత, పీఏసీఎస్ చైర్మన్లు అంజి రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, మండల పార్టీ నర్సింహ రెడ్డి, రైతు బంధు అధ్యక్షుడు విఠల్, తదితరులు పాల్గొన్నారు.