హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): ఎఫ్ఆర్వో చలమల శ్రీనివాసరావు ఆదర్శమని రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్స్ సంఘం కొనియాడింది. గొత్తికోయల దాడిలో నిరుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మృతి చెందిన ఎఫ్ఆర్వో చలమల స్మృత్యర్థం ‘అమరజీవి చలమల శ్రీనివాసరావు’ పుస్తకాన్ని ఆదివారం అరణ్యభవన్లో ఆవిష్కరించారు. శ్రీనివాసరావు గురించి వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలు, వ్యాఖ్యానాలకు విశ్రాంత అటవీ అధికారులు కే బుచ్చిరెడ్డి, నాగభూషణం, అటవీ క్షేత్రాధికారి ఎం రాంమోహన్ పుస్తక రూపాన్ని ఇచ్చారు.
ఈ సందర్భంగా విశ్రాంత అటవీ అధికారుల సంఘం అధ్యక్షుడు పీకే ఝా మాట్లాడుతూ అడవుల రక్షణలో శ్రీనివాసరావు చేసిన సేవలను కొనియాడారు. శ్రీనివాసరావు అడుగుజాడల్లో నడిచి అడవులు, అటవీ భూములను కాపాడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత అటవీ అధికారులు ఎంజే అక్బర్, వీవీ హరిప్రసాద్, ఖమర్ మహమ్మద్ ఖాన్, స్వామి దాస్, రామన్గౌడ్, మహమ్మద్ తయ్యబ్, ఎన్ కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.