న్యూస్నెట్వర్క్, నమస్తే తెలంగాణ: చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రద్దు చేయాలని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రధాని మోదీకి పోస్టులు రాశారు. బుధవారం నల్లగొండ జిల్లా చండూరులో మోదీకి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఉత్తరం రాసి పంపారు. నిర్మల్ నుంచి మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి మోదీకి పోస్టుకార్డు రాశారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి నుంచి మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్కుమార్, సంస్థాన్ నారాయణపురం నుంచి మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పోస్టుకార్డులు రాసి ప్రధానికి పంపారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ కారణంగా చేనేత కార్మికుల బతుకులు ఆగమవుతున్నాయని ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ నుంచి చేనేత కార్మికులతో కలిసి పీఎంకు పోస్టు కార్డు రాశారు.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని గర్శకుర్తిలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ లేఖ రాసి, ప్రధాని మోదీకి పోస్టు చేశారు. కరీంనగర్లో తెలంగాణ విద్యుత్ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడూరి ప్రకాశ్, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 3వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ ఆధ్వర్యంలో నేత కార్మికులు, జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని మార్కండేయ మందిరంలో పద్మశాలి సంఘం సభ్యులతో కలిసి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్వకుంట్ల సంజయ్, జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి ప్రధానికి లేఖ రాశారు. చేనేతపై జీఎస్టీ ఎత్తేసే వరకు ఉద్యమిస్తామని పెగడపల్లి మండలం బతికపల్లిలో పద్మశాలి సంఘం నాయకులు ప్రధానికి రాసిన లేఖలో స్పష్టం చేశారు. గొల్లపల్లి మండల కేంద్రంలోని పద్మశాలి సేవా సంఘం నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, మల్లాపూర్ మండల కేంద్రంలో పద్మశాలీ సంఘం నాయకులు చేనేతపై జీఎస్టీ రద్దు చేయాలని మోదీకి ఉత్తరాలు రాశారు.