హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో అన్ని దశల కౌన్సెలింగ్ పూర్తయ్యాక మిగిలిన సీట్ల భర్తీలో అక్రమాలు జరగలేదని హైకోర్టు తీర్పు వెలువరించింది. అన్ని రౌండ్ల కౌన్సెలింగ్ ముగిశాక సెప్టెంబరు 27నాటికి మిగిలిన సీట్ల భర్తీలో అక్రమాలకు ఆధారాలు లేవని తేల్చి చెప్పింది. నిబంధనల ప్రకారమే మిగిలిన 18 సీట్ల భర్తీ జరిగిందని స్పష్టం చేసింది. సీట్ల భర్తీలో అక్రమాలు, చట్టపరమైన, విధానపరమైన ఉల్లంఘనలు ఉన్నట్టుగా పిటిషనర్లు నిరూపించలేదని పేర్కొన్నది.
కౌన్సెలింగ్ తర్వాత మిగిలిన సీట్ల భర్తీలో అక్రమాలు జరిగాయని, అడ్మిషన్లను రద్దు చేయాలని కోరుతూ ఏపీలోని కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కేటీ సాయి రేవంత్రెడ్డి, మరో విద్యార్థి దాఖలు చేసిన వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్ కుమార్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనల తర్వాత హైకోర్టు, రెండో కౌన్సెలింగ్ తర్వాత మిగిలిన సీట్ల భర్తీ చట్టప్రకారమే జరిగిందని తీర్పు చెప్పింది. పిటిషన్లను కొట్టివేసింది.