హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో అసిస్టెంట్ ప్రొ ఫెసర్లకు అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతుల కల్పన ప్రక్రియ వాయిదా పడింది. మంగళవా రం కౌన్సెలింగ్లో గందరగోళం నెలకొనడంతో తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. జిల్లాకు ఒక మెడికల్ కాలే జీ ఏర్పాటు నేపథ్యంలో అవసరాల మేరకు అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాబితాను పరిశీలించగా, 183 మంది అర్హులని అధికారులు గుర్తించారు. వివిధ మెడికల్ కాలేజీల్లో అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి డీఎంఈ కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది.
మంగళవారం కౌన్సెలింగ్ నిర్వహిస్తామని వెల్లడించింది. కౌన్సెలింగ్కు రెండు మూడు రోజుల ముందు నుంచే కొందరు వైద్యులు తమకు నచ్చిన చోట వేకెన్సీలు చూపించడం లేదని, మరికొందరు తమకు హైదరాబాదే కావాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తూ వచ్చారు. మంగళవారం ఉదయం కౌన్సెలింగ్ సమయంలోనూ ఇలాంటి డిమాండ్లనే తెరమీదికి తెచ్చా రు.
రాష్ట్రవ్యాప్తంగా 900 వేకెన్సీలు ఉన్నాయ ని, వాటన్నింటినీ కౌన్సెలింగ్లో చూపించాలంటూ మొండిపట్టు పట్టారు. కౌన్సెలింగ్ను బహిష్కరిస్తున్నామంటూ డీఎంఈ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో అధికారులు కౌ న్సెలింగ్ను తాత్కాలికంగా వాయిదా వేశారు. త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తామని తెలిపారు. బదిలీలు, పదోన్నతులపై కొందరు చేసిన ఆరోపణలను డీఎంఈ రమేశ్రెడ్డి ఖండించారు.