హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నది. ఈ మేరకు గురువారం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో నంబర్ 5 జారీ చేశారు. బదిలీల ప్రక్రియను వెబ్ కౌన్సెలింగ్ ద్వారా, పదోన్నతుల ప్రక్రియను మాన్యువల్గా చేపట్టనున్నారు. క్యాటగిరీ ఖాళీలు, ప్రధానోపాధ్యాయుల పదోన్నతికి అర్హులైన సూల్ అసిస్టెంట్స్ సీనియారిటీ జాబితాలను శుక్రవారం ఆన్లైన్లో ప్రకటిస్తారు. ఈ నెల 28 నుంచి 30 వరకు బదిలీల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తుల హార్డ్కాపీలను ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 2లోపు అందజేయాల్సి ఉంటుంది. వీటిని ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు సంబంధిత ప్రధానోపాధ్యాయులకు సమర్పించాలి.
ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత టీచర్లు సంబంధిత ఎమ్ఈవోలకు అందజేయాలి. మండల పరిషత్ ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉపాధ్యాయులు సంబంధిత కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు, హైసూల్ ప్రధానోపాధ్యాయులు డీఈవోకు సమర్పించాలి. బదిలీలన్నీ వెబ్ కౌన్సెలింగ్ విధానంలోనే ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఐదేండ్లు పూర్తి చేసుకున్న ప్రధానోపాధ్యాయులు, మూడేండ్లుగా ఒకేచోట పనిచేస్తున్న టీచర్లను దరఖాస్తు చేసుకోకపోయినా బదిలీ చేయనున్నట్టు జీవోలో స్పష్టంచేశారు. మూడేండ్లలో ఉద్యోగ విరమణ చేయనున్న టీచర్లను వారు కోరుకుంటే తప్ప బదిలీ చేయరు.
బాలికల పాఠశాలల్లో 50 ఏండ్ల లోపు పురుష ఉపాధ్యాయులు ఉంటే వారిని బదిలీ చేసి ఆ స్థానంలో మహిళను నియమిస్తారు. ఒకవేళ మహిళా ఉపాధ్యాయులు లేకపోతే.. 50 ఏండ్లు నిండిన పురుషులను నియమిస్తారు. మార్చి 3న ఆప్షన్ల సవరణ, పునఃపరిశీలనకు అవకాశం కల్పించి, మార్చి 4న ఎస్జీటీ తత్సమాన క్యాటగిరీ ఉపాధ్యాయులకు బదిలీ ఉత్తర్వులు జారీచేస్తారు. మార్చి 5 నుంచి 19 వరకు డీఈవో ఇచ్చిన బదిలీ ఉత్తర్వులపై అప్పీళ్లు, అభ్యంతరాలను ఆర్జేడీకి, ఆర్జేడీ ఉత్తర్వులపై అభ్యంతరాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్కు పంపాలి. దరఖాస్తు అందిన 15 రోజుల్లో సంబంధిత అధికారులు వాటిని పరిషరించాలి.
ఉపాధ్యాయుల స్పౌజ్ క్యాటగిరీ బదిలీలకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. గురువారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన ఉత్తర్వులు జారీ చేశారు. సూర్యాపేట మినహా 12 జిల్లాల్లో 427 మంది టీచర్లను బదిలీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. స్పౌజ్ బదిలీల కోసం మొత్తం 615 మంది టీచర్లు ప్రభుత్వ పరిశీలనలో ఉండగా, అందులో 427 మంది టీచర్లు అర్హులని గుర్తించారు. శుక్రవారం టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభంకానున్నది. ఇందులోభాగంగా స్పౌజ్ బదిలీలు కూడా చేపట్టనున్నారు. దంపతులకు ఒకేచోట పనిచేసే అవకాశం కల్పించడం పట్ల స్పౌజ్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ వివేక్ హర్షం వ్యక్తం చేశారు.