హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): అంగన్వాడీ టీచర్లు, సహాయకులకు ఈఎస్ఐ సౌకర్యంతోపాటు గ్రాట్యుటీ, పీఎఫ్ లాంటి రిటైర్మెంట్ ప్రయోజనాలను కల్పించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ విజ్ఞప్తి చేసింది. సూపర్వైజర్ల నియామకాలు, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు పదోన్నతుల్లో సర్వీసు నిబంధనలను సడలించాలని, పెండింగ్ బిల్లులు త్వరగా చెల్లించాలని కోరింది. ఈ మేరకు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్యా దేవరాజన్కు శుక్రవారం వినతి పత్రం సమర్పించింది. అనంతరం యూనియన్ ప్రతినిధులతో దివ్యా దేవరాజన్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ జేడీ లక్ష్మీదేవి, ఎస్ఎన్పీ (సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్) అధికారులు నరసింహారావు, స్వరూప జూమ్ మీటింగ్ నిర్వహించారు. అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతున్నదని అధికారులు పేర్కొన్నారు. యూనియన్ ప్రస్తావించిన సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తామని, పెండింగ్ బిల్లులన్నీ 15 రోజుల్లోగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి, యూనియన్ నాయకులు రాంబాబు యాదవ్, ప్రధాన కార్యదర్శి విలాస కవి నిర్మల, కోశాధికారి మాచర్ల వేదవతి, ఉపాధ్యక్షులు భూపతిరావు రమాదేవి, జంగం రాణి, జే ఎల్లమ్మ, చింతల సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.