Medaram Jatara | తాడ్వాయి, మే 3: వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసంలో జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర తేదీలను పూజారులు బుధవారం నిర్ణయించారు. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు పూజారులు సమావేశమై తేదీలను ప్రకటించారు. మహా జాతరను రెండేండ్లకోసారి నిర్వహిస్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న మాఘశుద్ధ పంచమిని పురస్కరించుకొని మండమెలిగె పండుగతో అమ్మవార్ల మహా జాతర ప్రారంభమవుతుంది.
ఫిబ్రవరి 21 ద్వాదశి నాడు సాయంత్రం గుడిమెలిగె పండుగతోపాటు సారలమ్మ దేవత, గోవిందరాజులు, పగిడిద్దరాజులు గద్దెలకు చేరుకుంటారు. 22న త్రయోదశి రోజున కంకవనం గద్దె మీదకు వచ్చుట, సాయంత్రం సమ్మక్క దేవత గద్దె మీదకు చేరుకుంటారు. 23వ తేదీ మాఘ చతుర్దశి నాడు సమ్మక్క-సారలమ్మ దేవతలు, గోవిందరాజులు, పగిడిద్దరాజులకు భక్తులు మొక్కులు చెల్లిస్తారు. 24న మాఘశుద్ధ పౌర్ణమి నాడు దేవతలు వనప్రవేశం చేస్తారు. 28వ తేదీ మాఘశుద్ధ బహుళ పంచమి రోజు తిరుగు వారం పండుగ నిర్వహించాలని పూజారులు నిర్ణయించారు.