హైదరాబాద్/ సుల్తాన్ బజార్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో విపక్షాలు శవరాజకీయాలు చేస్తున్నాయి. హోంగార్డు రవీందర్ మృతికి రాజకీయరంగు పులుముతున్నాయి. వ్యక్తిగత, వృత్తిగత కారణాలతో మనస్థాపం చెందిన రవీందర్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు వెల్లడిస్తుండగా..రవీందర్ను కొందరు కావాలనే హత్య చేశారని ఆయన భార్య ఆరోపిస్తున్నది. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. వారి విచారణలో నిజమేదో తేలనున్నది. అయితే, ప్రతిపక్ష నాయకులు మాత్రం వాస్తవమేదో తేలకుండానే నిస్సిగ్గుగా దీన్ని ప్రభుత్వానికి అంటగట్టి.. రాజకీయ లబ్ధి పొందేందుకు పన్నాగం పన్నారు. హోంగార్డులకు వేతనాలు ఇవ్వకపోవడంతో మనస్థాపం చెంది రవీందర్ ఆత్మహత్య చేసుకొన్నాడని తెలంగాణ సర్కారును బదనాం చేసేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ప్రయత్నించారు. దీన్ని ప్రభుత్వ హత్యగా చిత్రీకరించేందుకు భారీ కుట్ర చేశారు. ఐదు నెలలుగా హోంగార్డులకు 1, 2వ తేదీల్లోనే వేతనాలు అందుతున్నాయి. రెండు నెలలుగా హైదరాబాద్ సిటీలో 2వ తేదీ, ఇతర కమిషనరేట్లలో 5వ తేదీలోపు వేతనాలు వారి అకౌంట్లలో జమవుతున్నాయి. ఏ నాడూ, ఏ నెలా తమ వేతనాలు ప్రభుత్వం ఆపలేదని హోంగార్డులే స్వయంగా చెప్తున్నారు.
ఈ వాస్తవాలను పక్కకు పెట్టి హోంగార్డులకు తెలంగాణ సర్కారు ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదంటూ రేవంత్రెడ్డి పచ్చి అబద్ధాలు వల్లెవేశారు. 16 వేల మంది హోంగార్డులకు ప్రతినెలా క్రమం తప్పకుండా వేతనాలు ఇస్తున్నా.. ప్రభుత్వం జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉందంటూ ప్రజలను, హోంగార్డులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. వేతనాల పేరుతో హోంగార్డులను రెచ్చగొట్టి తెలంగాణ సర్కారుపైకి ఉసిగొల్పేందుకు కుట్ర చేశారు. ‘గంతకు తగ్గ బొంత’లాగా రేవంత్కు కిషన్రెడ్డి వంతపాడారు. కమ్యూనిస్టు పార్టీల నేతలు చాడ వెంకట్రెడ్డి, కూనంనేని సాంబశివరావు వారి వ్యాఖ్యలను సమర్థిస్తూ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనంగా నిలిచారు. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఓ వర్గం మీడియా సైతం రవీందర్ భార్య చేస్తున్న వ్యాఖ్యలను ప్రసారం చేయకుండా.. నాయకులు మాట్లాడిన మాటలే పదే పదే ప్రసారం చేస్తూ బురద జల్లే ప్రయత్నం చేసింది.
హోంగార్డు భార్య సంధ్య ఏం చెప్పిందంటే?
“మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి నా భర్తది ఆత్మహత్య కాదు. ఆయనది ముమ్మాటికీ హత్యే. దానిని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు. నిజాయితీయే ఆయన ప్రాణాలు తీసింది. డ్యూటీకి వెళ్లే ముందురోజే ‘నాతో పిచ్చిపిచ్చిగా వాళ్లు ప్రవర్తిస్తున్నారు’ అని చెప్పిండు. కానిస్టేబుల్ చందు, ఏఎస్ఐ నర్సింగరావు ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారని వాపోయిండు. తనని ఇష్టమొచ్చినట్లు తిట్టి.. ప్రత్యేక రూంలోకి తీసుకెళ్లి.. పెట్రోల్ పోశారని నాకు ఎమర్జెన్సీ వార్డులో చెప్పిండు. పదే పదే.. ‘వాళ్లను వదలకండి’ అని చెబుతూ.. చివరిసారిగా ‘పిల్లలు జాగ్రత్త’ అని చెప్పి కన్నీరు పెట్టుకున్నడు. నా దగ్గర ఆ వీడియోలు ఉన్నాయి. హోంగార్డు డిపార్ట్మెంట్ మొత్తం ప్రీప్లాన్డ్గా నా భర్తను హత్య చేసింది. ఎవరైతే నా భర్తను చంపేశారో వాళ్లంతా బయటికి రావాలి” ఇదీ.. హోంగార్డు భార్య సంధ్య చెప్పిన అసలు సత్యం. మూడురోజులు అంపశయ్యపై తన భర్త ఉన్నా.. ఓ వర్గం మీడియా మొత్తం పనిగట్టుకొని ఆత్మహత్యగా, ప్రభుత్వ హత్యగా చిత్రీకరిస్తున్నా.. అందులో నిజం లేదంటూ గుండెలవిసేలా రోదించింది సంధ్య. నిజాన్ని చూపెట్టండని, తన భర్త హత్యకు కారకులైన వారిని బయటపెట్టండని కన్నీటితో వేడుకున్నది. ఈ వాస్తవం ప్రతిపక్షాలకు తెలిసినా.. ప్రభుత్వానికి మకిలి అంటించాలనే దురుద్దేశంతో ఆయా పార్టీలు, నేతలు పనిగట్టుకొని మరీ తలా తోక లేకుండా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు.
చికిత్సపొందుతూ రవీందర్ మృతి
అనుమానాస్పదంగా గాయాలపాలైన గోషామహల్ కమాండెంట్ ఆఫీస్లో విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డు రవీందర్ శుక్రవారం ఉదయం మృతి చెందారు. 72 శాతం కాలిన గాయాలతో డీఆర్డీ అపోలో దవాఖానలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న హోంగార్డు రవీందర్ భార్య సంధ్య ఉస్మానియా దవాఖాన ఓపీ బ్లాక్ ఎదుట తమ కుటుంబానికి న్యాయం చేయాలని బైఠాయించారు. ఈ సందర్భంగా రవీందర్ భార్య మీడియాతో మాట్లాడుతూ తన భర్తను హత్యచేసిన వారిని వెంటనే శిక్షించాలని కోరారు. తనకు న్యాయం జరిగే వరకు కదిలేదని బైఠాయించారు. కాగా, ఈస్ట్జోన్ డీసీపీ సునీల్ దత్, డీసీపీ కిరణ్, సుల్తాన్బజార్ డివిజన్ ఏసీపీ చిన్న బాలగంగిరెడ్డి.. రవీందర్ భార్య సంధ్య, కుటుంబ సభ్యులతో చర్చించారు. డీజీపీతో మాట్లాడి న్యాయం చేస్తామని ఒప్పించడంతో దీక్ష విరమించారు. అనంతరం మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా, హోంగార్డు రవీందర్ మృతి విషయాన్ని తెలుసుకున్న పలువురు నాయకులు రవీందర్ భార్య సంధ్యను పరామర్శించి, ఓదార్చారు. అందరూ కలిసి దాదాపు రూ. ఆరు లక్షల వరకు ఆర్థిక సాయం అందజేశారు.