హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): దేశంగానీ.. రాష్ట్రంగానీ అభివృద్ధి చెందిందని చెప్పేందుకు తలసరి ఆదాయాన్ని గీటురాయిగా తీసుకుంటారు. తలసరి ఆదాయ వృద్ధిరేటు ఆ దేశ/రాష్ట్ర అభివృద్ధి వేగానికి సూచిగా నిలుస్తుంది. ఈ రెండు అంశాల్లో జాతీయ తలసరి ఆదాయంతో పోల్చితే.. తెలంగాణ అందనంత ఎత్తులో ఉన్నది. జాతీయ తలసరి ఆదాయ వృద్ధిరేటు మందగమనంలో ఉంటే.. తెలంగాణ మాత్రం రాకెట్ వేగంతో దూసుకుపోతున్నది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని అతి తక్కువ తలసరి ఆదాయం ఉన్న జిల్లా కన్నా దేశ తలసరి ఆదాయం తక్కువగా ఉండటం గమనార్హం. సామాజిక ఆర్థిక సర్వే 2023లో ఈ విషయం వెల్లడైంది.
తలసరి ఆదాయంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ముందంజలో ఉన్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని జిల్లాలు సరికొత్త రికార్డును సృష్టించాయి. తలసరి ఆదాయంలో అన్ని జిల్లాలు జాతీయ తలసరి ఆదాయాన్ని మించి నమోదుచేశాయి. ప్రస్తుత ధరల వద్ద 2020-21 ఆర్థిక సంవత్సరంలో జాతీయ తలసరి ఆదాయం రూ.1,26,855గా నమోదుకాగా.. తెలంగాణలోని జిల్లాల కనిష్ఠ తలసరి ఆదాయం రూ.1,30,821గా ఉంది. అంటే.. జాతీయ ఆదాయం కన్నా రూ.3,966 అధికం.
తెలంగాణ ఏర్పడినప్పుడు 2014-15లో ప్రస్తుత ధరల వద్ద రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,24,104. జాతీయ తలసరి ఆదాయం రూ.86,647. అంటే జాతీయ తలసరి ఆదాయం కన్నా తెలంగాణ ఆదాయం 43 శాతం ఎక్కువగా ఉన్నది. 2022-23 సంవత్సరానికి వచ్చేసరికి ఈ గ్యాప్ ఇంకా పెరిగిపోయింది. తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,17,115కు చేరుకున్నది. జాతీయ తలసరి ఆదాయం మాత్రం రూ.1,70,620 కే పరిమితం అయ్యింది. అంటే రాష్ట్ర తలసరి ఆదాయం..దేశ తలసరి ఆదాయం కంటే రూ.1,46,495 అధికంగా ఉన్నది. ఇది 86 శాతం ఎక్కువ. తొమ్మిదేండ్లలో తెలంగాణ తలసరి ఆదాయం 155 శాతం పెరిగితే.. జాతీయ తలసరి ఆదాయంలో 96 శాతం మాత్రమే వృద్ధి నమోదుకావడం గమనార్హం.