Steel Bank | హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేలా పంచాయతీరాజ్శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో స్టీల్ బ్యాంకును ఏర్పాటు చేస్తున్నది. దీంతో ప్లాస్టిక్ స్థానంలో స్టీల్ వస్తువులను వాడనున్నారు. సిద్దిపేట జిల్లాలోని మొత్తం పంచాయతీలు స్టీల్ బ్యాంకును ఏర్పాటు చేసి రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచాయి. మిగిలిన జిల్లాలు అదే బాటలో ఉన్నాయి.
పర్యావరణానికి హాని కలిగిస్తున్న ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ఉన్న అన్ని అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నది. దేశవ్యాప్తంగా సింగి ల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధిస్తూ కేంద్రం నిర్ణ యం తీసుకొన్నది. ఈ నేపథ్యంలో మన రాష్ట్రం చేపట్టిన స్టీల్ బ్యాంకు దేశానికి ఆదర్శంగా నిలవనున్నది. స్టీల్ బ్యాంక్ కార్యక్రమంలో భాగం గా.. పంచాయతీ కార్యాలయాల్లో నిర్వహించే సమావేశాలు, అక్కడికి వచ్చే ప్రజలు, అధికారులు, సిబ్బంది, తాగునీరు, భోజనాలు చేయ డం తదితర వాటి కోసం ప్లాస్టిక్ వస్తువుల స్థానంలో స్టీల్ను వాడేలా స్టీల్ బ్యాంకును రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది.
అంటే.. స్టీల్ గ్లాసులు, మగ్గులు, ప్లేట్లు, గిన్నెలు, స్టీల్ బ్యాటి ల్స్ కొనుగోలు చేస్తారు. వీటినే అన్ని కార్యక్రమాల్లో వినియోగిస్తారు. ప్రస్తుతానికి రాష్ట్రంలోని 170 మండలాల్లోని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్లాస్టిక్ బ్యాంక్ను ఏర్పాటు చేశారు. మరికొన్ని మండలాల్లోని గ్రామ పంచాయతీలు స్టీల్ వస్తువులను కొనుగోలు చేస్తున్నాయి. అన్ని గ్రామ పంచాయతీల్లో ప్లాస్టిక్ బ్యాంకును ఏర్పాటు చేసి సిద్దిపేట జిల్లా ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచింది. ఈ జిల్లాలో ఉన్న 23 మండలాల్లోని 499 పంచాయతీ కార్యాలయాల్లో స్టీల్ బ్యాంక్ను ఏర్పాటు చేశారు. నల్లగొండ జిల్లాలో 14 మండలాలు, నిజామాబాద్లో 11, ఆదిలాబాద్లో 10 మండలాల్లోని పంచాయతీల్లో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు.