వనపర్తి : పల్లెలు దండులా కదిలి వచ్చి ప్రగతిని ఆశీర్వదించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ నెల 8న సీఎం కేసీఆర్ వనపర్తిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో వనపర్తి మెడికల్ కళాశాల సమీపంలో జరిగే బహిరంగ సభ సభాస్థలి, జిల్లా పార్టీ కార్యాలయాన్ని పరిశీలించి అధికారులు, నేతలకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సీఎం సభకు ప్రతి ఒక్కరు తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి చెందిన నియోజకవర్గాల సరసన వనపర్తి చేరిందన్నారు. ఏడేళ్లలో వేల కోట్ల రూపాయలతో పల్లెపల్లెనా ప్రగతిని పరుగులు పెట్టించామని ఆయన తెలిపారు.
సీఎంకేసీఆర్ రైతుల పక్షపాతి. రైతుల కష్టాలు తెలిసినందునే వ్యవసాయ అనుకూల విధానాలు అవలంబిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సాగునీటితో వెనుకబడిన జిల్లా వనపర్తి సస్యశ్యామలం అయిందన్నారు.