హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాలు బహుళ ప్రయోజనాలు సాధిస్తున్నాయని నీతి ఆయోగ్ ప్రశంసించింది. పచ్చదనం పెంపుదల, వర్షపు నీటి సంరక్షణ, జీవ వైవిధ్యం పరిపరక్షణ తదితర అంశాల్లో మం చి ఫలితాలు సాధిస్తున్నాయని కితాబిబ్చింది. తెలంగాణకు హరితహారంలో భాగంగా చేపట్టిన ఆ రెండు కార్యక్రమాలను ‘సామాజిక రంగంలో ఉత్తమ ఆచరణలు’ అనే నివేదికలో కొనియాడింది. అటవీ విస్తీర్ణాన్ని 24 నుంచి 33 శాతానికి పెంచాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నదని వివరించింది. గ్రామీణాభివృద్ధి, అటవీశాఖల సమన్వయం తో 19,472 పంచాయతీల్లో పల్లె ప్రకృతి వనాల పెంపును చేపట్టిందని వెల్లడించింది. మియావాకి స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం ఆచరణలో పెట్టిన యాదాద్రి మాడల్ ప్లాంటేషన్ అద్భుతమని శ్లాఘించింది. గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీశాఖల కలయికతో సాధిస్తున్న ఫలితాలకు చక్కటి ఉదాహరణగా నీతి ఆయోగ్ అభివర్ణించింది. కేవలం ఎకరా స్థలంలోనే 4000కుపైగా స్థానిక జాతులకు చెందిన ఔషధ, కలప, అటవీ, పండ్లు తదితర విభిన్న రకాల మొక్కలను పెంచడం అభినందనీయమని ప్రశంసించింది.
గ్రామాల్లో డంప్యార్డ్లోనే వర్మి కంపోస్ట్ను తయారుచేసి మొక్కలకు ఎరువుగా వినియోగించడం గొప్ప విషయమని, అది భూసారాన్ని కూడా పెంచుతున్నదని నీతి ఆయోగ్ అభినందించింది. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధుల్లో 10% నిధులను గ్రీన్ బడ్జెట్గా కేటాయించి పచ్చదనం పెంపునకు వినియోగించడం ఆదర్శప్రాయమని తెలిపింది. పల్లెప్రకృతి వనాలతోపాటు తెలంగాణ ప్రభుత్వం 5 నుంచి 10 ఎకరాల్లో బృహత్ ప్రకృతి వనాల పెంపు కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా కొనసాగిస్తున్నదని కొనియాడింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలంలో 5 చొప్పున మొత్తంగా 545 మండలాల్లో 2,725 బృహత్ ప్రకృతి వనాలను పెంచాలని కార్యాచరణ సిద్ధం చేసిందని వివరించింది. పల్లె ప్రకృతి వనాలను ప్రారంభించిన ఏడాదిలోనే పక్షులు, కీటకాలకు సహజసిద్ధ ఆవాసాలుగా మారిపోయాయని వివరించింది. భూమిని సారవంతం చేసేందుకు అత్యంత అవసరమైన నత్రజని స్థాపన కూడా గణనీయంగా పెరిగిందని వెల్లడించింది. మొక్కలు దట్టంగా పెరగడం వల్ల వర్షపు నీరు ప్రవహించకుండా అడ్డుకుని భూమిలోకి ఇంకిపోయేలా చేయడంతోపాటు, భూమి కోతను కూడా గణనీయంగా తగ్గిస్తున్నదని తెలిపింది. భూగర్భజలాలను పెంచడంతోపాటు తేమను కూడా కాపాడుతున్నదని నీతిఆయోగ్ నివేదిక కొనియాడింది.