JEE Main | హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్ పరీక్షల నిర్వహణలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అభ్యర్థులతో ఆడుకుంటున్నది. సోమవారం షిఫ్ట్-1 పరీక్ష పేపర్లో గణితం, ఫిజిక్స్ ప్రశ్నలను కఠినంగా ఇచ్చారు. న్యూమరికల్ వ్యాల్యూ ప్రశ్నలు కఠినంగా, పెద్దవిగా ఉండటంతో సమాధానాలు రాయడంలో విద్యార్థులు అవస్థలు పడాల్సి వచ్చింది. కెమిస్ట్రీ ప్రశ్నలు సులభంగానే ఇచ్చినా, అధికంగా ఎన్సీఈఆర్టీ సిలబస్ నుంచే ఇవ్వడం గమనార్హం. మొదటి ఫిప్ట్కు హాజరైన వారు 300 మార్కులు సాధించడం కష్టమని, ప్రతిభావంతులు 290 -280 మార్కులలోపే సాధించే అవకాశాలున్నట్టు శ్రీచైతన్య ఐఐటీ ఆలిండియా కో ఆర్డినేటర్ ఉమాశంకర్ అంచనా వేశారు. ఇక మధ్యాహ్నం నిర్వహించిన షిప్ట్-2 పరీక్ష పేపర్ సులభంగా ఉన్నట్టు తెలిపారు. ఈ పేపర్లో గణితం ప్రశ్నలు పొడవుగా ఉన్నా విద్యార్థులు తేలిగ్గానే ఆన్సర్లు చేశారని విశ్లేషించారు. ఫిష్ట్-2కు హాజరైన వారు 300 మార్కులు సాధించవచ్చని అభిప్రాయపడ్డారు.
జేఈఈ మెయిన్ పరీక్షల నిర్వహణలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పొరపాట్ల మీద పొరపాట్లు చేస్తున్నది. ఈ సంస్థ నిర్వాకంతో అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. జేఈఈ మెయిన్-1 పరీక్ష పేపర్లో తొలగించిన సిలబస్ నుంచి ప్రశ్నలిస్తున్నారు. తొలగించిన సిలబస్ నుంచి సోమవారం కెమిస్ట్రీలో ఒక ప్రశ్న రాగా, 27న ఫిజిక్స్లో ఎక్స్పరిమెంటల్ ఫిజిక్స్ నుంచి ఒక ప్రశ్న అడిగారు. సోమవారం షిఫ్ట్-1లో జరిగిన ఫిజిక్స్ పేపర్లో ఒక ప్రశ్నకు ఇచ్చిన నాలుగు ఆప్షన్లలో సమాధానాలు ఇవ్వనేలేదు. దీంతో అభ్యర్థులు అయోమయంలో పడ్డారు.