హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): రియల్ ఎస్టేట్ డెవలపర్లను సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్టీ) అధికారులు వేధిస్తున్నారని, తప్పుడు నోటీసులు జారీచేసి ఖాతాలను మూసివేయిస్తున్నారని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) అధ్యక్షుడు సునీల్ చంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సీజీఎస్టీ హైదరాబాద్ జోన్ చీఫ్ కమిషనర్ బీవీ శివనాగ కుమారి సోమవారం ల్యాండ్ డెవలపర్లతో నిర్వహించిన సమావేశంలో సునీల్ చంద్రారెడ్డి మాట్లాడారు.
భూములను డెవలప్మెంట్కు తీసుకున్నప్పుడు భూ యజమానుల జీఎస్టీ వాటాకు వారే బాధ్యత వహిస్తారని, వారు జీఎస్టీ కట్టడం లేదన్న కారణంతో అధికారులు డెవలపర్లను వేధించడం సరికాదని అన్నారు. జీఎస్టీ అధికారులు ఉద్దేశపూర్వకంగా బిల్డర్లను టార్గెట్ చేస్తున్నారని, ఇకనైనా వేధింపులు మానుకోవాలని కోరారు. ఈ అంశంపై త్వరలో సీజీఎస్టీ కమిషనర్తో భేటీ కానున్నట్టు తెలిపారు. సమావేశంలో తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్) ఉపాధ్యక్షుడు విద్యాసాగర్, పలువురు డెవలపర్లు, జీఎస్టీ అధికారులు పాల్గొన్నారు.