హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): దేశానికి నేర రాజధానిగా ఉత్తరప్రదేశ్ ‘ఘనకీర్తి’ సాధించింది. దేశంలోనే అత్యధికంగా 112.7% క్రైమ్ రేట్తో అగ్రస్థానంలో కొనసాగుతున్నట్టు తాజా నివేదికలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆ ర్బీ) వెల్లడించింది. ఆ తర్వాతి స్థానాల్లో కేర ళ, మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్ నిలిచినట్టు తెలిపింది. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం.. ప్రతి లక్ష మంది జనాభా ఉన్న ప్రాంతంలో దాదాపు 446 నేరాలు జరుగుతున్నాయి. ఈ రేటు నిరుటి కంటే 0.5% తక్కువే అయినప్పటికీ నేరాలను అదుపు చేయడంలో పలు రాష్ర్టాలు విఫలమయ్యాయి. పట్టణీకరణ, జనాభా వేగంగా పెరగడం, ఉపాధి కొరవడటం, సామాజిక భద్రత లేకపోవడం, పోలీసులకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం తదితర అంశాలు నేరాల పెరుగుదలకు ప్రధాన కారణమని తేల్చారు.
తెలంగాణ, ఏపీ, కర్ణాటక, ఉత్తరాఖండ్, జార్ఖండ్ లాంటి రాష్ర్టాల్లో పోలీస్ వ్యవస్థను బలంగా తీర్చిదిద్దడం, వారికి సరైన శిక్షణ ఇప్పించడం, అవసరమైన సామగ్రి, మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు చట్టాన్ని అమలు చేసే సంస్థల మధ్య నిరంతర సహకారం, సమన్వయం వల్ల నేరాలు అదుపులో ఉన్నట్టు పేర్కొన్నారు. ముఖ్యంగా నేర పరిశోధనకు ఆధునిక సాంకేతికతను విరివిగా ఉపయోగించుకోవడం, ఫోరెన్సిక్ సైన్స్ను మరింతగా సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా ఎంతో క్లిష్టమైన కేసులను సైతం త్వరగా ఛేదిస్తున్నారని జాతీయ దర్యాప్తు సంస్థల అధికారులు చెప్తున్నారు.