హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): విపత్తులపై మున్సిపల్ శాఖ సమాయత్తమవుతున్నది. వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యలపై క్షేత్రస్థాయి సిబ్బందికి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) అధికారులతో శిక్షణ ఇప్పిస్తున్నది. వానకాలంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడం, ప్రజలను సురక్షితంగా తరలించడం లాంటి చర్యలపై అవగాహన కల్పిస్తున్నది. శిక్షణ ఇవ్వడంతో పట్టణాల్లో సహాయక చర్యల్లో పాల్గొనడానికి మెరుగైన అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నది. ఫతుల్లాగూడలోని డిజాస్టర్ ట్రైనింగ్ సెంటర్లో డిజాస్టర్, ఫైర్ సేఫ్టీపై ఆరు రోజుల పాటు శిక్షణ ఇప్పిస్తున్నది. 36 పట్టణ స్థానిక సంస్థల్లోని 389 మందిని 8 బ్యాచులుగా విభజించి, ఒక్కో బ్యాచ్లో 50 మంది చొప్పున ట్రైనింగ్ ఇస్తున్నది. 15 నుంచి 20 వరకు కొనసాగనున్న రెండో బ్యాచ్ శిక్షణకు సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ హాజరై మాట్లాడారు. విపత్తులు, వరదలు, వర్షాలు, అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు ఎలా స్పందించాలనే దానిపై అవగాహన ఉంటే అనేక ప్రమాదాలు జరుగవని చెప్పారు. విపత్తు సమయాల్లో ప్రజలు ఎలా వ్యవహరించాలనే దానిపై ప్రాథమికంగా అవగాహన ఉండేలా చూడాలని సూచించారు.
డీఆర్ఎఫ్ ద్వారా శిక్షణ తీసుకునే పట్టణ స్థానిక సంస్థలు
మున్సిపల్ కార్పొరేషన్లు : గ్రేటర్ వరంగల్, బడంగ్పేట, మీర్పేట్, బోడుప్పల్, జవహర్నగర్, నిజాంపేట, పీర్జాదిగూడ, కరీంనగర్, ఖమ్మం, నిజాంపేట, రామగుండం.
మున్సిపాలిటీలు : మేడ్చల్, సిద్దిపేట, సిరిసిల్ల, మహబూబ్ నగర్, నాగర్కర్నూలు, ఆసిఫా బాద్, నారాయణ్పేట, సూర్యా పేట, సంగారెడ్డి, వికారాబాద్, భువనగిరి, నల్లగొండ, కొత్తగూ డెం, కామారెడ్డి, జగిత్యాల, మంచిర్యాల, మెదక్, నిర్మల్, జనగామ, గద్వాల, వనపర్తి, మహబూబాబాద్, ఆదిలాబాద్, భూపాలపల్లి, నర్సంపేట.