హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం పరిసరాల్లో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. శనివారం రాత్రి రింగ్రోడ్డు సమీపంలో ఉన్న చెట్ల పొదల్లో ఓ ఆవును చిరుతపులి చంపేసిందని తెలిసింది. అదేరాత్రి సమీపంలోని రత్నానందస్వామి ఆశ్రమం వద్ద ఉన్న హోమగుండం వద్ద ఓ గోడపై చిరుతపులి కూర్చొని ఉండటాన్ని చూసిన పలువురు భక్తులు, స్థానికులు తమ ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీశారు.
ఇవి వైరల్ అయ్యాయి. వరుస సెలవులు రావడంతో చాలామంది శ్రీశైలం దేవస్థానానికి తరలివస్తున్నారు. చిరుతపులి సంచారంతో స్థానికులు, పర్యాటకులు తీవ్ర భయాందోళనతో ఉన్నారు. శ్రీశైలంలో రోజురోజుకూ చిరుత పులుల సంచారం పెరుగుతుండటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. చిరుతపులుల సంచారంపై తాము ఎన్నిసార్లు ఫిర్యాదులు ఇచ్చినా ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు స్థానికులు ఆరోపిస్తున్నారు.