హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): యావత్తు జగత్తును వణికిస్తున్న రాకాసి ప్లాస్టిక్. పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న రక్కసి ప్లాస్టిక్. ఇటీవల ప్లాస్టిక్ బాటిళ్ల వాడకం పెద్దఎత్తున పెరిగిపోతున్నది. ఇలాంటి భూతం నుంచి బయటపడాలంటే రీసైక్లింగ్, పునర్వినియోగం ఒక్కటే మార్గం. అ దిశగా పనిచేస్తున్నది రంగారెడ్డి జిల్లా చందనవెల్లిలో ఉన్న కుందనా టెక్నో టెక్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ ఫ్యాక్టరీ ప్లాస్టిక్ బాటిళ్లను మింగేస్తున్నది. రోజుకు 150 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ బాటిళ్లను క్రష్ చేస్తున్నది. టీ షర్ట్లు, వస్ర్తాల తయారీలో వినియోగించే ముడిసరుకును ఉత్పత్తి చేస్తున్నది. టీషర్ట్లు తయారుచేసే ఫైబర్, ఫుడ్ గ్రేడ్ గ్రాన్యూల్స్ ఉత్పత్తి చేసి గుజరాత్సహా ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేస్తున్నారు. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ‘బీట్ ది ప్లాస్టిక్ పొల్యూషన్’ థీమ్తో ఏడాదంతా పర్యావరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఏడాదికి 54,750 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ ఖతం
వాటర్బాటిళ్లు, కూల్డ్రింక్బాటిళ్లు, ఇతర పానీయాల ప్లాస్టిక్బాటిళ్లను, వాడిపారేసిన బాటిళ్లను ఈ కంపెనీలో ముడిసరుకుగా ఉపయోగిస్తారు. రోజుకు 150 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ బాటిళ్లను రీసైకిల్ చేస్తారు. అంటే ఏడాదికి 54,750 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ను ఈ కంపెనీలో ముడిసరుకుగా వినియోగిస్తున్నారు. ఏడాదికి లక్ష మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ బాటిళ్లను రీసైకిల్ చేసేలా కంపెనీ విస్తరణప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణతోపాటు ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి రాష్ర్టాల నుంచి ప్లాస్టిక్ బాటిళ్లను సేకరిస్తున్నారు. ఆ ప్లాస్టిక్ను ఫైబర్, ఫుడ్ గ్రేడ్ గ్రాన్యూల్స్గా తయారుచేస్తారు. వీటిని టెక్స్టైల్ పరిశ్రమల్లో ఉపయోగిస్తారు.
60 శాతం ప్లాస్టిక్ రీసైకిల్
మనం వాడుతున్న దాంట్లో 60 శాతం ప్లాస్టిక్ను రీసైకిల్ చేసుకోవచ్చు. తెలంగాణలో ప్లాస్టిక్ రీసైక్లిం గ్, పునర్వినియోగాన్ని విరివిగా ప్రోత్సహిస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అంచనాల ప్రకారం రాష్ట్రంలో రోజూ 40 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థా లు పోగవుతున్నాయి. ఇవి భూమిలో జీర్ణమయ్యేవి కాకపోవడంతో ప్రత్యేక పొరను ఏర్పరుచుకొని వాననీరు భూమిలోకి ఇంకకుండా అడ్డుపడుతున్నాయి.