హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 23 (నమస్తే తెలంగాణ): వానకాలానికి అనువైన పల్లి వంగడాన్ని హైదరాబాద్ లోని ఇంటర్నేషనల్ క్రాప్స్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ ఎరిడ్ ట్రాపిక్స్ (ఇక్రిశాట్) అభివృద్ధి చేసింది. ప్రస్తుతం నూనె పంటలకు అధిక డిమాండ్ ఉండడంతో జన్యుమార్పులతో అధిక దిగుబడి సాధించేలా జునాగఢ్ వర్సిటీతో కలిసి ‘జీజీ40’ వంగడాన్ని సృష్టించింది. రెండేళ్లుగా దీనిపై పరిశోధనలు సాగుతుండగా ఈ సీజన్లో అందుబాటులోకి వచ్చింది.
నీటి లభ్యత అధికంగా ఉండే వానకాలంలో మొలక వృద్ధి ఆగిపోవడం, మొక్క ఎదిగాక వేరు మురిగిపోవడం వంటి సమస్యలను అధిగమించడంలో భాగంగా ఈ వంగడాన్ని తీసుకొచ్చినట్టు పరిశోధకులు తెలిపారు. ఓలిక్ యాసిడ్ పుష్కలంగా ఉండే ఇందులో నూనెల దిగుబడి కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం వినియోగంలో ఉన్న వంగడాల కంటే సగటున 30-40శాతం మేర అధిక దిగుబడి తక్కువ కాల పరిమితిలో వస్తుందని తెలిపారు. చీడపీడలను తట్టుకుని సాగు చేయడానికి వీలు ఉంటుందని వివరించారు. ఈ రకం తెలుగు రాష్ర్టాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు వాతావరణ పరిస్థితులకు అనువుగా ఉంటుందని వివరించారు. మెట్ట భూముల్లోనూ మంచి దిగుబడిని పొందవచ్చని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న గిర్నార్ రకం కంటే ఎక్కువ దిగుబడి వస్తుందని ఇక్రిశాట్ వర్గాలు తెలిపాయి.