ముషీరాబాద్, జూలై 4: పోలీసులు అరెస్టు చేసిన వామపక్ష కార్యకర్తలను వెంటనే విడుదల చేసి, వారిపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని పలువురు వామ పక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. తీస్తా సెతల్వాద్, శ్రీరామ్కుమార్, సంజీవ్భట్, మహమ్మద్ జుబేర్ అరెస్టులను ఖండిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ గుజరాత్లో నరేంద్రమోదీ ప్రోత్సాహంతోనే మారణహోమం, ముస్లింల ఊచకోత చోటుచేసుకొన్నాయని ఆరోపించారు. గుజరాత్ అల్లర్ల బాధితుల పక్షాన తీస్తా సెతల్వాద్ పోరాడి 68 మంది నేరస్తులకు శిక్షపడేలా చేశారని తెలిపారు. నాడు గుజరాత్ హోంమంత్రిగా ఉన్న హిరేన్ పాండ్యాను ముస్లింలే చంపారని చిత్రీకరించడం, సిట్ బృందం పక్షపాతంతో ఎలాంటి అల్లర్లు జరగలేదని నివేదిక ఇవ్వడం అంతా ఓ పథకం ప్రకారం జరిగాయని మండిపడ్డారు. మోదీ, అమిత్షాకు వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్పిన వారు చనిపోవడం, శిక్షపడటం, వేధింపులకు గురికావడం జరిగినా సిట్ నిద్రావస్తలో ఏమీ తేల్చలేకపోయిందని ఆరోపించారు.
తమ మాట వినని, ప్రశ్నించే పార్టీల నేతలపై ఈడీ, సీబీఐ కేసుల పేరుతో కేంద్రం బెదిరింపులకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. మోదీకి వ్యతిరేకంగా ఉన్నవారిపైనే కేసులు నమోదవుతున్నాయని, మద్దతుగా నిలిస్తే కేసులు పెండింగ్లో ఉంటున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎన్ బాలమల్లేశ్ అన్నారు. కార్యక్రమంలో వామపక్ష నాయకులు పోటు రంగారావు, ఉపేందర్రెడ్డి, సాదినేని వెంకటేశ్వర్రావు, మురహరి, డీజీ నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.