హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): గిరిజన రిజర్వేషన్ల పెంపునకు తాను అనుకూలంగా లేనని మోదీ ప్రభుత్వం మరోసారి చాటుకున్నది. కోర్టు కేసుల పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేసింది. మొన్నటిదాకా తెలంగాణ బిల్లు ముసాయిదా తమకు అందలేదని చెప్తూ వచ్చిన కేంద్రం, తాజాగా అది తమకు అందిందని అంగీకరించింది. టీఆర్ఎస్ ఎంపీ రంజిత్రెడ్డి (చేవెళ్ల) సోమవారం లోక్సభలో వేసిన ప్రశ్నతో కేంద్ర సర్కారు బండారం బయటపడింది.
గిరిజన రిజర్వేషన్ల బిల్లు అంశంపై కేంద్రానికి రంజిత్ పలు ప్రశ్నలు సంధించారు. “గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లు కేంద్రానికి అందిందా? ఒకవేళ అందితే ఆ బిల్లుపై ఎలాంటి చర్యలు తీసుకొన్నారు? ఆమోదం కోసం రాష్ట్రపతికి ఏమైనా పంపారా? పంపకపోతే అందుకు కారణాలు ఏమిటి?” అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా సమాధానం ఇచ్చారు. తెలంగాణ బీసీ, షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల బిల్లు – 2017 పేరిట విద్యా, ఉద్యోగ అవకాశాల్లో ఆయా వర్గాలకు రిజర్వేషన్లను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లు కేంద్ర హోంశాఖకు చేరిందని మంత్రి వెల్లడించారు.
ఆ బిల్లుపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టులో అనేక కేసులు పెండింగ్లో ఉన్నాయని, వాటి పరిష్కారం తర్వాతే ఆ బిల్లుపై ముందుకు వెళ్తామని కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. పార్లమెంటు చేసే చట్టాలను సుప్రీంకోర్టు ఎలా ఆపుతుందని ఒకవైపు వాదిస్తున్న కేంద్ర ప్రభుత్వం, గిరిజన రిజర్వేషన్ల బిల్లుకు మాత్రం కేసుల పేరు చెప్పడం గమనార్హం. కాగా, గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలని, ఆ దిశగా కేంద్రం సత్వరమే చర్యలు చేపట్టాలని ఎంపీ రంజిత్రెడ్డి డిమాండ్ చేశారు.