హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): ధాన్యం విషయంలో రాష్ర్టానికి చేయాల్సిన నష్టం చేసిన కేంద్రం ఇప్పుడు సడీ సప్పుడు చేయటం లేదు. నెలన్నర పాటు రాష్ట్రం నుంచి బియ్యం సేకరణను నిలిపేయటంలో మిల్లుల్లోని ధాన్యం వర్షాలకు పూర్తిగా తడిసిపోయింది. ఆ ధాన్యం మొలకెత్తి ఎందుకూ పనిరాకుండా పోయింది. ఈ విధంగా సుమారు 10 లక్షల టన్నుల ధాన్యం తడిసినట్టు అంచనా. ఆ నష్టం విలువ రూ.1,500 కోట్లకు పైగానే ఉంటుంది. ఈ నెల 20 నుంచి బియ్యం సేకరణకు అంగీకరిస్తున్నట్టు ప్రకటించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్.. తడిసిన ధాన్యం గురించి మాత్రం మాటెత్తలేదు. దానిపై మీడియా ప్రశ్నించినా తప్పించుకొనే ప్రయత్నం చేశారు. కేంద్రం నిర్లక్ష్యం వల్లే ధాన్యం తడిసిపోయింది కాబట్టి ఆ నష్టాన్ని కేంద్రమే భరించాలని మిల్లర్లు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం సకాలంలో బియ్యం తీసుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని చెప్తున్నారు. కాగా, మొలకెత్తిన ధాన్యం పనికిరాదు కాబట్టి ఆ నష్టాన్ని తగ్గించేందుకు బాయిల్డ్ రైస్ తీసుకోవాలని ఎఫ్సీఐని కోరాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ఈ మేరకు లేఖ రాయనున్నది. ఎఫ్సీఐ మొండి వైఖరినే ప్రదర్శిస్తే.. తడిసిన ధాన్యాన్ని వేలం వేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది.
బాయిల్డ్ రైస్ తీసుకోవాలి
కేంద్రం నిర్లక్ష్యం వల్లే ధాన్యం తడిసిపోయింది. కాబట్టి ఈ నష్టాన్ని కేంద్రమే భరించాలి. తడిసిన ధాన్యం రా రైస్కు పనికి రాదు కాబట్టి.. బాయిల్డ్ రైస్ తీసుకొనేందుకు అంగీకరించాలి. లేకపోతే రాష్ట్ర ప్రభుత్వంపై భారీగా ఆర్థిక భారం పడే అవకాశం ఉన్నది.
– గంగుల కమలాకర్, పౌరసరఫరాల శాఖ మంత్రి