Rain Update | హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో మూడు నాలుగు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంటూ, ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ‘వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నది’ అని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
నిజామాబాద్లో అత్యధిక వర్షపాతం
నిజామాబాద్ జిల్లాలో గురువారం అత్యధికంగా 42.3 మి.మీ వర్షపాతం నమోదైంది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయని, మరికొన్ని చోట్ల మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ వివరించింది. గురువారం ఉదయం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్లో భారీ వానలు పడ్డాయి. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, కరీంనగర్, హైదరాబాద్ జంట నగరాలతోపాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదైందని టీఎస్డీపీఎస్ వివరించింది.
సాధారణం కంటే అధికం
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో వర్షపాతం ఆశాజనకంగానే నమోదవుతుందని వాతావరణశాఖ అంచనా వేస్తున్నది. ఏటా జూన్ ఒకటి నుంచి సెప్టెంబర్ 30 తేదీ వరకు నైరుతి రుతుపవనాల సీజన్గా పేర్కొంటారు. ఈ సీజన్కు రాష్ట్రంలో 72.10 సెం.మీ సాధారణ వర్షపాతం. సెప్టెంబర్ 7వ తేదీ నాటికే (గురువారం) 74.35 సెం.మీ వర్షపాతం నమోదైంది. అంటే సాధారణం కంటే 1.03 శాతం ఎక్కువగానే కురిసింది.