హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్)లో ముఖ్య ఘట్టం ముగిసింది. 800 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న రెండో యూనిట్కు సంబంధించి అత్యంత బరువుగా ఉండే 450 టన్నుల జనరేటర్ రోటర్ను17 మీటర్ల ఎత్తులో ఉన్న ఫ్లోర్లో విజయవంతంగా అమర్చారు. ఇందుకు టవర్ క్రేన్ ను ఉపయోగించారు. గురువారం ఈ భారీ జనరేటర్ రోటర్ను అమర్చే ప్రక్రియను ట్రా న్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు దగ్గరుండి పర్యవేక్షించారు.
ఈ ఘట్టాన్ని పూర్తి చేసిన బీహెచ్ఈఎల్ ప్రతినిధులను, ఇంజినీర్లను అభినందించారు. గురువారం దామరచర్లలోని వైటీపీఎస్ను సందర్శించిన ఆయన.. ప్లాంట్ మొత్తం కలియ తిరిగారు. ప్లాంట్ నిర్మాణ పనుల పురోగతిపై సమీక్షించారు. పలు సూచనలు చేస్తూ, అనుకొన్న సమయంలోగా నిర్మాణ పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. 4000 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ప్లాంట్ నిర్మాణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్కు అప్పగించారు.
ఈ సందర్భంగా ఆయన.. బీహెచ్ఈఎల్ గత సమావేశం సందర్భంగా ఒప్పుకున్నట్టుగానే జూన్ 2023 నాటికి రెండు యూనిట్ల ను కమర్షియల్ ఆపరేషన్, ఒక యూనిట్ను సింక్రనైజ్ చేయాలని ఆదేశించారు. ప్లాంట్ లోపల ఫైర్ స్టేషన్ను ప్రారంభించిన సీఎండీ ప్రభాకర్రావు.. బాయిలర్ హైడ్రాలిక్ టెస్ట్ చేశారు. సీఎండీ వెంట జెన్కో డైరెక్టర్లు సచ్చిదానందం, అజయ్, సీఈలు సమ్మయ్య, పీవీ శ్రీనివాస్, ఎస్ఈ ఈగ హనుమాన్, ఈఈ బుచ్చయ్యతోపాటు బీహెచ్ఈఎల్ నుంచి ఈడీ మురళీ, ప్రాజెక్ట్ డైరెక్టర్ అర్మయ్ ముఖర్జీ ఇతర ప్రతినిధులు ఉన్నారు.