Heavy Rains | బంగాళాఖాతంలో తీవ్రంగా మారిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారవచ్చునని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో వచ్చే 3 రోజులు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): రానున్న 24 గంటల్లో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు తెలిపింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా వాయుగుండం ప్రభావంతో బుధ, గురువారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మంగళవారం హైదరాబాద్లో తేలికపాటు నుంచి మెస్తరు వర్షాలు కురిసే అవకాశముందని, బుధవారం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురవచ్చని తెలిపింది.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. హనుమకొండ, జనగామ, వరంగల్లో కొన్ని చోట్ల, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, ములుగు, మహబూబాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసినట్టు తెలిపింది. నిజామాబాద్ జిల్లా వెల్పూర్లో అత్యధికంగా 40 సెం.మీ, జక్రాన్పల్లి, భీంగల్ 23, వరంగల్ జిల్లా సంగెం 22, నెల్లబల్లిలో 17, హనుమకొండ జిల్లా ఆత్మకూర్ 17, జనగామ జిల్లా జఫర్గఢ్ 16, జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ 14, సాయంపేట, పరకాల, మోర్తాడ్, ఆర్మూర్లో 14, వరంగల్ జిల్లా పర్వతగిరి, ములుగులో 13, బోనకల్, పాలకుర్తి, డోర్నకల్లో 12, చెన్నారావుపేట, శ్రీరాంపూర్, కూసుమంచి, మహబూబాబాద్లో 11సెంటిమీటర్ల వర్షపాతం నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు పొలాల్లో సెల్ఫోన్లు వాడొద్దని రైతులకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి నాగరత్న సూచించారు. ఉరుములు, మెరుపులు బారిన పడే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. కరెంట్ స్తంభాలు, చెట్ల కింద నిలబడొద్దని, పొలాల్లో ఉన్నప్పుడు నేలపై కూర్చోవాలని సూచించారు. ఎత్తుగా నిలబడి ప్రయాణం చేయవద్దని కోరారు.