హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): ఈటల వట్టి మాటల మనిషేనని మరోసారి నిరూపితమైనదని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. ఇతర పార్టీల్లోని సీనియర్లను బీజేపీలోకి తీసుకొస్తారని నమ్మి ఏడాది క్రితం చేరికల కమిటీ బాధ్యతలను ఆయనకు అప్పగించింది అధిష్టానం. ఇప్పటిదాకా తనపై ఉంచిన నమ్మకాన్ని రుజువు చేసుకోలేకపోయారని ఈటలపై ఆరోపణలున్నాయి. తాజాగా అమిత్షా పర్యటన దీనికి మరింత ఆజ్యం పోసిందనే చెప్పాలి. ఇటీవల ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావును బీఆర్ఎస్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో వారిని బీజేపీలోకి తీసుకొచ్చేందుకు ఈటల విశ్వ ప్రయత్నాలు చేశారు. ఢిల్లీకి వెళ్లి జేపీ నడ్డా సహా, పార్టీ పెద్దలతో చర్చలు జరిపారు. అమిత్ షా సమక్షంలో పార్టీ కండువా కప్పుతామని చెప్పారు. వాళ్లు చేరేదీ లేనిదీ స్పష్టంగా తెలుసుకోకుండానే అమిత్ షా టూర్ ఖరారు చేశారు.
తీరా.. వారిద్దరూ బీజేపీలో చేరటంలేదని, కాంగ్రెస్ వైపు చూస్తున్నారని తెలిసింది. దీంతో బీజేపీ నేతలంతా ఉసూరుమన్నట్టు వినికిడి. ఏ ముఖం పెట్టుకొని అమిత్ షా దగ్గరికి వెళ్లాలని మధనపడ్డారట. చేవెళ్లకు వచ్చిన అమిత్ షా సైతం ఈ విషయంపై పార్టీ నేతలను ప్రశ్నించినట్టు తెలిసింది. ఇతర పార్టీల నుంచి ముఖ్య నేతలు వస్తున్నారని చెప్పారు.. ఇప్పుడేమో ఒక్కరు కూడా ఎందుకు లేరు? అని ప్రశ్నించగా..రాష్ట్ర నేతలు నీళ్లు నమిలారట. ప్రత్యేకంగా చేరికల కమిటీ పెట్టినా పెద్దగా ప్రయోజనం లేదని అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. రాష్ట్ర పార్టీలో పట్టుమని పది మంది కూడా ముఖ్యనేతలు లేరని, వారిలో కూడా ఒకరంటే ఒకరికి పడటం లేదని, సమన్వయం పూర్తిగా కొరవడిందని షా క్లాస్ పీకినట్టు తెలుస్తున్నది.
చేరికల కమిటీ చైర్మన్గా ఈటల రాజేందర్కు దాదాపు ఏడాది కిందట పగ్గాలు అప్పజెప్పారు. బీఆర్ఎస్లో కీలక నేతగా ఉన్న ఈటలకు రాష్ట్రవ్యాప్తంగా మంచి పరిచయాలు ఉంటాయని బీజేపీ అధిష్టానం భావించింది. కానీ.. ఆ భ్రమలు తొలిగిపోవడానికి ఎక్కువ కాలం పట్టలేదు. బీఆర్ఎస్లో పార్టీ పరంగా పరిచయాలే తప్ప.. ఇతర నేతలను ఒప్పించి బీజేపీలో చేర్పించేంత చాకచక్యం ఈటలకు లేదని కొన్ని రోజులకే తెలిసి వచ్చింది. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న నేతలకు ఈటల ఫోన్లు చేసి బీజేపీలోకి ఆహ్వానించారు. అంతేతప్ప.. బీఆర్ఎస్, కాంగ్రెస్లో కీలకంగా ఉన్న ఒక్క నేతను కూడా తీసుకురాలేకపోయారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తీసుకురావడం, ఉప ఎన్నిక వంటివన్నీ ఢిల్లీ స్థాయిలోనే జరిగాయి.
బూర నర్సయ్య గౌడ్ వంటి పెద్దగా ప్రజాదరణ లేని, మాజీ నేతలు మాత్రమే బీజేపీ కండువా కప్పుకున్నారు. అయితే.. ఒకరు వస్తే నలుగురు వెళ్లిపోయినట్టుగా బీజేపీ నుంచి నేతలు తిరుగుముఖం పట్టారు. మరోవైపు పార్టీలో ఈటలకు ప్రాధాన్యం ఇవ్వడం బండి సంజయ్కి మొదటి నుంచీ నచ్చడం లేదన్నది బహిరంగ రహస్యం. దీంతో పొమ్మనలేక పొగబెట్టినట్టు పార్టీలోకి ఎవరూ రాకుండా అడ్డుపడుతున్నట్టు గుసగుసలు వినిపించాయి.
ఓ సందర్భంలో ఈటల తనకు చేరికల కమిటీ చైర్మన్ బాధ్యతలు వద్దని ఢిల్లీ పెద్దలకు చెప్పినట్టు సమాచారం. ఆ తర్వాత వారు బుజ్జగించటంతో వెనక్కి తగ్గినట్టు తెలిసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎలాగూ అన్ని నియోజకవర్గాలకు సరిపడా అభ్యర్థులు లేరు. బీఆర్ఎస్, కాంగ్రెస్కు చెందిన అసంతృప్త నేతలపైనే బీజేపీ ఆశలు పెట్టుకున్నది. ఇలాంటి సమయంలో ఎంత భరోసా ఉంచినా.. ఇతర పార్టీల నుంచి కీలక నేతలను తీసుకురావడంలో ఈటల ఫెయిల్ అయ్యారని అధిష్టానం కూడా ఫీలవుతున్నట్టు సమాచారం.