MLC Kavitha | న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు దర్యాప్తులో సీబీఐ అనుసరిస్తున్న తీరును బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తరఫు న్యాయవాదులు తీవ్రంగా తప్పుపట్టారు. ఈ కేసు విచారణ లేదా దర్యాప్తులో తాను ఆశించిన సమాధానాన్ని నిందితులు చెప్పాలన్న ధోరణితో సీబీఐ వ్యవహరిస్తున్నదని ఆక్షేపించారు. సీబీఐ అడిగే ప్రశ్నకు సమాధానాలు తెలియనప్పుడు ఎవరైనా తెలియదనే జవాబు చెప్తారని, అవే ప్రశ్నలను సీబీఐ తిప్పి తిప్పి మళ్లీ మళ్లీ అడిగితే మౌనంగా ఉంటారని పేర్కొంటూ.. ఈ విధంగా పిటిషనర్ కవిత చేయడం తప్పిదమన్నట్టుగా సీబీఐ వాదన ఉన్నదని అన్నారు. తీహార్ జైలులో ఈ నెల 6న కవితను సీబీఐ విచారించడం, ఆ తర్వాత అరెస్టు చేయడం అన్యాయమంటూ ఆమె తరఫు న్యాయవాదులు విక్రమ్ చౌదరి, నితీశ్ రాణా, మొహిత్రావు శుక్రవారం వాదనలు వినిపించారు.
కవితను సీబీఐ విచారించడం, అరెస్టు చేయడంపై తాము దాఖలు చేసిన రెండు పిటిషన్లపై విచారణ చేపట్టాలని కోర్టును కోరడంతో ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా మధ్యాహ్నం 2 గంటలకు విచారణ చేపట్టారు. దీంతో కవిత తరఫు న్యాయవాదులు వాదన కొనసాగిస్తూ.. రాజ్యాంగంలోని 20(3) అధికరణ పౌరులకు మౌనంగా ఉండే హకును కల్పించిందని, ఇది ప్రాథమిక హకుల్లో ఒకటని పేర్కొన్నారు. సెల్వీ-పంకజ్ బన్సర్ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం పౌరులకు మౌనంగా ఉండే హకు ఉన్నదన్నారు. జవాబు చెప్పేవరకు ఒకే ప్రశ్నను తారుమారు చేసి తిప్పి తిప్పి గుచ్చి గుచ్చి అడిగితే ఎవరైనా తెలియదనే సమాధానం చెప్తారని అన్నారు.
అదే ప్రశ్నను మళ్లీ మళ్లీ అడిగితే చివరికి మౌనంగానే ఉంటారని, తెలియని విషయం గురించి ఎవరూ తనకు తాను వ్యతిరేకంగా చెప్పుకోరని వివరించారు. పిటిషనర్ కవిత రాజ్యాంగానికి, చట్టాలకు లోబడి వ్యవహరిస్తున్నారని, ఆమె పట్ల సీబీఐ అత్యుత్సాహాన్ని చూపుతున్నదని చెప్పారు. కవితకు సీబీఐ నోటీసు ఇవ్వకుండా, కవిత తరఫున వాదించే న్యాయవాదులకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అక్రమంగా అరెస్టు చేసిందని విక్రమ్ చౌదరి తప్పుపట్టారు. కవిత వాదనలు వినకుండా ఆమెను సీబీఐ కస్టడీ ఇవ్వడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. తీహార్ జైలులో ఉన్న కవిత సాక్షులను ప్రభావితం చేయలేరని, సాక్ష్యాధారాలను తారుమారు చేయలేరని పేర్కొంటూ.. ఆమెను అరెస్టు చేయాల్సిన అవసరం ఏమున్నదని అన్నారు.
సీఆర్పీసీలోని సెక్షన్ 41ఏ కింద పిటిషనర్కు నోటీసు జారీ చేశాక అరెస్టు చేయడం ఏమిటని, ఒక కేసులో అరెస్టయి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తిని అదే కేసులో మరో దర్యాప్తు సంస్థ ఎలా అరెస్టు చేస్తుందని ప్రశ్నించారు. కవిత అరెస్టుకు చూపుతున్న కారణాలన్నీ పాతవేనని, ఆమెను తిరిగి అరెస్టు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ఎంతో జనాదరణ ఉన్న కవిత ఓ జాతీయ రాజకీయ పార్టీకి చెందిన చట్టసభ సభ్యురాలని, తెలంగాణలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆమెను అరెస్టు చేయడం సబబు కాదని తెలిపారు. దీనిపై సీబీఐ తరఫు న్యాయవాది ప్రతివాదన చేస్తూ.. కోర్టు అనుమతితోనే కవితను అరెస్టు చేశామని, ఈ అరెస్టుపై ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని అన్నారు. ఈ వాదనల అనంతరం కోర్టు స్పందిస్తూ.. కవితను అరెస్టు చేసేందుకు సీబీఐ ముందస్తుగానే దరఖాస్తు చేసిందని, తమ ఉత్తర్వుల తర్వాతే ఆమెను అరెస్టు చేసినందున ఇది కోర్టు పరిధిలోని విషయమని తెలిపింది.
కోర్టు హాల్ నుంచి బయటకు వచ్చాక కవిత మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. సీబీఐ తప్పు మీద తప్పు చేస్తున్నదని ఆరోపించారు. అసలు ఢిల్లీ లిక్కర్ పాలసీపై కేసు నమోదు చేయడమే తప్పని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీబీఐ అడిగే ప్రశ్నలే ఊహాజనితమైనవని, వాటికి ఏమి సమాధానాలు చెప్పగలమని ప్రశ్నించారు. సీబీఐ అధికారులు మళ్లీ అవే ప్రశ్నలు అడుగుతారని, కొత్తగా ఏమీ లేదని అన్నారు. సీబీఐ ప్రయత్నాలన్నీ వృథా ప్రయాసేనని స్పష్టం చేశారు.
నిబంధల ప్రకారమే తనను అరెస్టు చేసినట్టు సీబీఐ చేసిన వాదనను కవిత కోర్టులోనే తప్పుపట్టారు. ఈ అరెస్టుపై తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలిపారు.
కవిత అరెస్టు గురించి ఆమె భర్తకు ముందే సమాచారం ఇచ్చామని సీబీఐ చెప్తున్నది. కానీ, సీబీఐ చెప్పిన సమయానికి, వారెంట్లో పేర్కొన్న సమయానికి తేడా ఉన్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. కవితను గురువారం మధ్యాహ్నం 12.15 గంటలకు అరెస్టు చేసినట్టు వారెంట్లో సీబీఐ పేరొన్నది. కానీ, కవిత అరెస్టుపై ఆమె భర్త అనిల్కు మధ్యాహ్నం 12.56 గంటలకు మెసేజ్ పంపింది. దీన్ని బట్టి కవిత అరెస్టుకు ముందే ఆమె భర్తకు సమాచారం ఇవ్వలేదని స్పష్టమవుతున్నది.
విచారణ నిమిత్తం కవితను 5 రోజులపాటు తమకు అప్పగించాలన్న సీబీఐ అభ్యర్థనను రౌస్ ఎవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. చివరికి ఆమెను 3 రోజులపాటు (ఈ నెల 14 వరకు) సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐ కస్టడీలో కవితకు ప్రతి 45 గంటలకోసారి వైద్య పరీక్షలు నిర్వహించాలని, ఆమె ఇం టి నుంచి భోజనం, దుస్తులు, పుస్తకాలు, జపమాల తెప్పించుకునేందుకు అనుమతితోపాటు పరుపు, బెడ్షీట్లు, టవల్స్, పిల్లో అందజేయాలని పేర్కొన్నది. 15న ఉదయం 10 గంటలకు కవితను తిరిగి హాజరుపరచాలని ఆదేశించింది. కవితను రోజూ సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కుటుంబసభ్యులు కలుసుకునేందుకు అనుమతిచ్చింది. కవితను కలిసేవారి జాబితాలో న్యాయవాది మొహిత్రావు పేరు చేర్చాలని స్పష్టం చేసింది.