హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే జోన్లోనే అతి పెద్దదైన చర్లపల్లి టర్మినల్ ఇప్పట్లో అందుబాటులోకి వచ్చేలా లేదు. తెలంగాణ ప్రతిపాదనలను అటకెక్కిస్తున్న రైల్వేశాఖ.. ఆన్గోయింగ్ ప్రాజెక్టులపై కూడా శీతకన్ను ప్రదర్శిస్తున్నది. పనులు ప్రారంభించిన రెండేండ్లలోనే అందుబాటులోకి రావాల్సిన చర్లపల్లి రైల్వే స్టేషన్లోని టర్మినల్ నాలుగేండ్లయినా పూర్తి కాలేదు. ఇంకా ఏడాది ఆగాల్సిందేనని రైల్వేశాఖ చల్లగా చెప్తున్నది. తాజా బడ్జెట్ కేటాయింపులు చూస్తే అది కూడా కష్టమేననిపిస్తున్నది. రూ.221 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ఈ ప్రాజెక్టు పనులు నాలుగేండ్ల క్రితం మొదలయ్యాయి. వాస్తవానికి గత డిసెంబర్లోనే పనులన్నీ పూర్తి కావాల్సి ఉన్నది. కానీ ఇప్పటివరకు 50% పనులే చేశారు. దీంతో రైల్వేశాఖ గడువును ఈ ఏడాది డిసెంబర్కు పొడిగించింది. 50% పనులకు నాలుగేండ్లు పడితే మిగిలిన సగం పనులు ఏడాదిలో పూర్తి చేస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పెరిగిన వ్యయమెంతో?
గతంలో రూపొందించిన అంచనా వ్యయం రూ.221 కోట్లయితే తాజా అంచనా వ్యయం ఎంతనేది రైల్వేశాఖ అధికారులు వెల్లడించడం లేదు. 2021-22 బడ్జెట్లో రూ.50 కోట్లు, 2022-23లో రూ.70 కోట్లు, తాజా బడ్జెట్లో రూ.82 కోట్లు కేటాయించారు. దీంతో మూడేండ్ల బడ్జెట్ కేటాయింపులు కూడా గత అంచనా వ్యయాన్ని చేరుకోలేదు. కేటాయింపుల్లో ఎంత ఖర్చు చేశారనేది అధికారికంగా వెల్లడించడం లేదు. కేటాయింపులు సరిపడేంత లేక… అంచనా వ్యయం పెరగడంతో టర్మినల్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనేది ప్రశ్నగా మిగిలింది.