KGBV | హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని కేజీబీవీలు చదువుల కోవెలలుగా రూపాంతరం చెందాయి. పేద.. బీద బిక్కీ.. బాలికలకు ఆశ్రయాన్నిస్తున్నాయి. మంచి భవిష్యత్తుకు బాటలేస్తున్నాయి.. ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్నాయి. చదువుకొనే చక్కటి వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. ఇలాంటి కేజీబీవీల్లో చేరేందుకు బాలికలు క్యూ కడుతున్నారు. దీంతో వీటిల్లో అడ్మిషన్లకు తీవ్ర డిమాండ్ నెలకొన్నది. ఈ ఏడాది ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అమరచింతలో తల్లిదండ్రులు సీట్లు పెంచాలంటూ ధర్నాను నిర్వహించారంటే వాటికి ఉన్న క్రేజ్ను అర్థం చేసుకోవచ్చు. ఇక తాకిడిని తట్టుకోలేక మంచిర్యాల జిల్లా చెన్నూరు కేజీబీవీలో అడ్మిషన్లు క్లోజ్ అంటూ బోర్డు పెట్టారు.
475 కేజీబీవీలు..
రాష్ట్రంలో 475 కేజీబీవీలుండగా, త్వరలోనే మరో 20 కొత్త కేజీబీవీలు ప్రారంభంకాబోతున్నాయి. అంటే రాష్ట్రంలో వీటి సంఖ్య 495కు చేరుతుంది. ఈ ఏడాదే 200కు పైగా కేజీబీవీలకు అధునాతన మాడ్యులర్ కిచెన్లు మంజూరయ్యాయి. వృత్తివిద్యకు ప్రాధాన్యం ఇస్తూ 66 కేజీబీవీల్లో వొకేషనల్ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను నిర్వహిస్తున్నారు. ఇక 84 కేజీబీవీలకు సొంతభవనాలు నిర్మిస్తుండగా, ఇప్పటివరకు 31 భవనాలు పూర్తయ్యాయి. మరో 163 కేజీబీవీల్లో కొత్తగా డార్మెటరీలు నిర్మిస్తుండగా, వీటిలో 85 పూర్తయ్యాయి. ఇక్కడి వాతావరణానికి అలవాటైన బాలికలు చదువు పూర్తయ్యాక వీటిని వదిలివెళ్లేందుకు అస్సలు ఇష్టపడరు. టీచర్లు పూర్వవిద్యార్థులను ఎప్పటికప్పుడు కనిపెట్టుకొని ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. టీచర్లు ఆయా బాలికలతో సత్సంబంధాలు నెరుపుతూ.. ఆప్యాయతను పంచుతూ భవిష్యత్తుకు మార్గదర్శనం చేస్తారు. ఇదే కేజీబీవీల విజయానికి సూత్రంగా మారింది.
కేజీబీవీల ప్రత్యేకతలు..
ఈ ఏడాది 38 కేజీబీవీల్లో ఇంటర్
రాష్ట్రంలోని కేజీబీవీలు బాలికల బంగారు భవిష్యత్తుకు బాటలేస్తున్నాయి. అనేక మంది అమ్మాయిలను ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్నాయి. ఈ సంవత్సరమే రాష్ట్రంలోని 38 కేజీబీవీలను ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేశాం. వీటిలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ క్లాసులు ప్రారంభమవుతాయి. వచ్చే ఏడాది సెంకడియర్ క్లాసులను ప్రారంభిస్తాం. రాష్ట్రంలో మొత్తం 475 కేజీబీవీలుంటే వీటిల్లో 1. 33 లక్షల బాలికలు చదువుతున్నారు. 475 కేజీబీవీల్లో 245 కేజీబీవీలను ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేశాం. ఈ విద్యాసంవత్సరం నుంచి డైట్ చార్జీలను రూ. 1,049 నుంచి రూ. 1,225కు పెంచాం. మంచి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందజేస్తున్నాం.
– విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
ఫలితాల్లో మేటి
ప్రవేశాలే కాదు.. ఫలితాల్లోను కేజీబీవీలు సత్తా చాటుతున్నాయి. 2023 ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 82.99 శాతం ఉత్తీర్ణతను నమోదుచేశాయి. రాష్ట్ర సగటు ఉత్తీర్ణత 63.49శాతం ఉంటే.. రాష్ట్ర సగటు ఉత్తీర్ణత కన్నా కేజీబీవీలు 20శాతం అధికంగా ఉత్తీర్ణతను నమోదుచేశాయి. 27 కేజీబీవీలు వందకు వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. పదో తరగతి ఫలితాల్లోనూ 83.86శాతంతో అత్యుత్తమ ఫలితాలు పొందాయి. 91 కేజీబీవీలు 100శాతం ఉత్తీర్ణత సాధించగా, 23 మంది మంది విద్యార్థులు 10కి 10 జీపీఏను సాధించారు. ఇక 1,084 విద్యార్థులు 9 నుంచి 9.9 మధ్య జీపీఏను సొంతం చేసుకొన్నారు. ఎంసెట్ -23 ఫలితాల్లోను అత్యుత్తమ ఫలితాలను కైవసం చేసుకొన్నారు. ఇంజినీరింగ్లో 78.55శాతం మెడికల్ అగ్రికల్చర్లో 84.39శాతం క్వాలిఫై అయ్యారు. గతంలో జేఎన్టీయూ, ఓయూ, కేయూ సహా పలు వర్సిటీ క్యాంపస్లలో సీట్లు పొందారు.
సాధికారత క్లబ్బులు
అఘాయిత్యాలు, అవాంఛిత ప్రవర్తన వంటి సమస్యలపై బాలికల్లో అవగాహన కల్పించేందుకు కేజీబీవీల్లో బాలికా సాధికారత క్లబ్బులను ఏర్పాటు చేశారు. ఇందులోభాగంగా కేజీబీవీలను స్థానిక పోలీసులతో అనుసంధానిస్తూ.. ఫిర్యాదుల పరిష్కార విభాగాన్ని ప్రవేశపెట్టారు. శారీరక వేధింపులు, అహింస, లైంగికదాడులు, బాల్య వివాహాలు వంటి సమస్యలను ఎదుర్కొనేలా వీటి ద్వారా తర్ఫీదునిస్తున్నారు. బాలికలకు తమ హక్కులపై అవగాహన కల్పించడం, ఆత్మ విశ్వాసాన్ని నింపడం, ఆత్మాభిమానాన్ని పాదుకొల్పేందుకు ప్రత్యేక చొరవ తీసుకొంటున్నారు.
అత్యున్నత విద్యాసంస్థల్లో చేరిన విద్యార్థులు
కోర్సు : ప్రవేశాలు పొందినవారు
ఎంబీబీఎస్ : 20
నీట్ : 05
ఫార్మసీ : 47
ఎల్ఎల్బీ : 02
బీఎస్సీ/ ఎమ్మెస్సీ : 49
నర్సింగ్ : 32
ట్రిపుల్ ఐటీ : 20
ఎంబీఏ : 17
బీటెక్ : 80
ఇంటర్ వరకు అప్గ్రేడేషన్ ఇలా..
సంవత్సరం : ఇంటర్ వరకు అప్గ్రేడ్చేసినవి
2018-19 : 84
2019-20 : 88
2021-22 : 36
2022 -23 : 37
మొత్తం : 245
ఉద్యోగాలు పొందినవారు
ప్రభుత్వ ఉద్యోగాలు : 112
కార్పొరేట్ ఉద్యోగులుగా స్థిరపడ్డారు : 102
అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అధికారులు : 15