IT Jobs | హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): జీతం పెద్ద మ్యాటర్ కాదు, స్కిల్ ఉంటే చాలు.. ఎంతైనా ఇచ్చి తీసుకుంటాం.. ఇదీ ఐటీ కంపెనీల మాట. మారుతున్న టెక్నాలజీకి తగ్గట్టు అప్డేట్ అయ్యేవారికోసం నిత్యం శోధిస్తూనే ఉంటాయి. నైపుణ్యం ఉంటే జాబ్ పక్కా అని రిక్రూటింగ్ సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం ఐటీలో ట్రెండింగ్ జాబ్ రోల్స్ జాబితాలో ఫుల్ స్టాక్ డెవలపర్, ఆండ్రాయిడ్ డెవలపర్, ఏడబ్ల్యూఎస్ ఇంజినీర్, రోబోటిక్ ఇంజినీర్, డెవాప్స్ ఇంజినీర్, బ్లాక్చైన్ టెక్నాలజీ డెవలపర్, ఏఐ-ఎంల్ ఇంజినీర్, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, డాటా సైంటిస్ట్ వంటివి ఉన్నాయి. మరో నాలుగైదేండ్ల పాటు ఈ ఉద్యోగాలకు ఢోకా లేదు. మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్ వంటి కంపెనీలు సైతం ఈ అంశాల్లో నైపుణ్యం ఉన్నవారికోసం వెతుకుతున్నాయి.
ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న ఐటీ జాబ్ రోల్స్కు వార్షిక ప్యాకేజీలు సైతం ఎంతో ఆకర్షణీయంగా ఉంటున్నాయి. ఉదాహరణకు ఫుల్స్టాక్ డెవలపర్(ప్రెషర్)కు రూ.5-6 లక్షల వార్షిక వేతనం ఉంటే, డాటా సైంటిస్ట్కు ఏడాదికి రూ.11 లక్షల వరకు ఉంటుంది. ఉద్యోగ ప్రారంభంలోనే ఈ స్థాయి వేతనాలు ఇచ్చేందుకు ఐటీ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. ‘కాలేజీల్లో ఉండగానే ఇంజినీరింగ్ విద్యార్థులు ఆయా టెక్నాలజీలపై నైపుణ్యం సాధిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఉద్యోగంలో చేరాక టెక్నాలజీలపై అప్డేట్గా ఉంటే ఆకర్షణీయమైన ప్యాకేజీలు అందుకోవచ్చు. పెద్ద కంపెనీల ఆఫర్లు తలుపు తడతాయి’ అని సీనియర్ ఐటీ ఉద్యోగులు పేర్కొంటున్నారు.