IT Refund scam | హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ట్రాల్లో ఐటీ రీఫండ్ కుంభకోణం కలకలం సృష్టిస్తున్నది. సుమారు రూ.500 కోట్లకు పైగానే స్కాం జరిగినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొదట ఈ కుంభకోణంలో ట్యాక్స్ కన్సల్టెంట్లను అనుమానించిన అధికారులు మరింత లోతుగా విచారించడంతో చార్టెడ్ అకౌంట్ల పాత్ర వెలుగులోకి వచ్చింది.
ట్యాక్స్ కన్సల్టెంట్లతో కలిసి సీఏలు భారీగా రీఫండ్ డబ్బు కాజేసినట్టు తెలిసింది. ప్రభుత్వ, ప్రైవేట్, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు భారీగా లబ్ధిపొందినట్లు అనుమానాలున్నాయి. మొత్తం రూ.500 కోట్ల కుంభకోణం జరిగిందని గుర్తించిన అధికారులు ఉభయ రాష్ర్టాల్లో సుమారు 16 ప్రాంతాల్లో సోదాలు చేశారు. హైదరాబాద్లోనే 8 చోట్ల, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, అనంతపూర్లో సోదాలు చేశారు. కాగా, ఈ కుంభకోణంలో భాగస్వాములైన వందలాది మందిని విచారిస్తున్నారు.
ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ట్యాక్స్ కన్సల్టెంట్లు, సీఏలు, కొందరు రైల్వే, పోలీసుశాఖ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఇప్పటికే అధికారులు నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. సోదాలు ముగిసిన తర్వాత తప్పుడు పత్రాలు సృష్టించిన వారిని అరెస్టు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.