యాచారం, జనవరి 20: రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలో కుక్కల పట్టివేత అంశం తీవ్ర కలకలం రేపుతున్నది. గ్రామపంచాయతీ ఆదేశాల మేరకు కొందరు యాచారంలో ఉన్న వీధి కుక్కలను పట్టుకొని విష ప్రయోగం చేయడంతో కొన్ని కుక్కలు మృతి చెందాయని, ఇది చట్టరీత్యా నేరమని కొందరు కలెక్టర్ నారాయణరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఢిల్లీకి చెందిన స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సంస్థకు చెందిన నలుగురు ప్రతినిధులు మంగళవారం యాచారం సీఐ నందీశ్వర్రెడ్డికి కూడా ఫిర్యాదు చేశారు.
యాచారంలో ఆదివారం కొందరు కుక్కలకు పట్టుకునే క్రమంలో విషప్రయోగం చేయడం వల్లే అవి మృతి చెందినట్టు సదరు ఫౌండేషన్ సంస్థ వారు పేర్కొన్నారు. దాదాపు 80 కుక్కలను చంపినట్టు వారు ఆరోపించారు. బాధ్యులను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన పోలీసులు.. పంచాయతీ కార్యదర్శి కిషన్నాయక్ను పిలిచి కుక్కల పట్టివేత అంశంపై ఆరా తీశారు. దీనిపై పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని సూచించారు.