హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): గోదావరి నది, అనుబంధ ప్రవాహాల ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలని నీటిపారుదలశాఖ నిర్ణయించింది. దీనిపై నెలరోజుల్లోగా సమగ్రంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని నిర్ణయించింది. నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం జలసౌధలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరి నది పరివాహక ప్రాంతం, బ్యాక్వాటర్పై నిరుడు సెప్టెంబర్లో నియమించిన నిపుణుల కమిటీ ప్రతిపాదనలపై చర్చించారు. అనంతరం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముంపు ముప్పు అధికంగా ఉన్న భద్రాచలం ఆలయం, పర్ణశాల, మణుగూరు భారజల ప్లాంటు రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, గోదావరికి అనుబంధంగా ఉన్న 37 ప్రవాహాల్లో 10 వేల క్యుసెక్కుల కన్నా అధికంగా నీరు పారుతున్న 7 ప్రధాన ప్రవాహాలపై రక్షణ చర్యలు తీసుకోవాని నిర్ణయించారు. ఈ చర్యలపై సమగ్రంగా అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని నియమించి నెల రోజుల్లోగా ప్రభుత్వానికి తుది నివేదికను సమర్పించాలని నిర్ణయించారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని సంప్రదించి ముందస్తుగా చర్యలు తీసుకోవడంతో బ్యాక్వాటర్ ముప్పు తప్పిందని రజత్కుమార్ పేర్కొన్నారు.
కడెం గేట్లు మార్చాల్సిందే
కడెం ప్రాజెక్టును భారీ వరదలు ముంచెత్తుతున్న నేపథ్యంలో ప్రాజెక్టు పరిస్థితి, వరదల కారణాలపై కన్సల్టెన్సీ సంస్థ వాస్సర్ ల్యాబ్స్ అధ్యయనం చేసింది. సమీక్ష సందర్భంగా సంస్థ ప్రతినిధి డాక్టర్ రామరాజు అధ్యయనంలో తేలిన అంశాలను వివరించారు. కడెం ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో పడే వర్షంలో 70 శాతం ప్రాజెక్టుకు అత్యంత సమీపంలోనే కురుస్తున్నదని చెప్పారు. దీంతో కనీసం గేట్లు తెరిచేందుకు కూడా సమయం ఇవ్వకుండా వరద పోటెత్తుతున్నదని వివరించారు. 18 గేట్లు ఎత్తేందుకు 2 గంటల సమయం పడుతున్నదని, వరద మాత్రం గంటలోనే 3 లక్షల క్యుసెక్కులకు చేరుతున్నదని పేర్కొన్నారు. ప్రాజెక్టుకు బిగించిన గేట్లు 65 ఏండ్ల నాటివని, వాటిని మార్చాలని సూచించారు. రజత్కుమార్ మాట్లాడుతూ వరదను కొలిచేందుకు కడెం ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో రివర్ గేజ్లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.