QR Code | హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): డెబిట్, క్రెడిట్ కార్డుల క్లోనింగ్ మోసాలను నిలువరించేందుకు యూపీఐ లావాదేవీలను ప్రవేశపెట్టినప్పటికీ అవగాహన లేక మధ్య తరగతి వ్యా పారులు నష్టపోతున్నారు. మోసగాళ్లు అలాంటివారిని టార్గెట్ చేస్తూ ఆయా షాపుల ముందు అంటించిన క్యూఆర్ కోడ్లను తీసేసి, తమ క్యూఆర్ కోడ్లను అతికిస్తున్నారు. వ్యాపారులకు కొనుగోలుదారులు పంపుతున్న డబ్బులు నేరుగా మోసగాళ్ల ఖా తాలో పడుతున్నాయి. ఇలా హైదరాబాద్లోని ఓ రెస్టారెంట్ వ్యాపారి ఇటీవల వారం లోనే రూ.40 వేల మేరకు నష్టపోయాడు.
డూప్లికేట్ క్యూఆర్ కోడ్ మోసాలు దేశవ్యాప్తంగా నమోదవుతున్నాయి. మోసపోయిన వ్యాపారుల్లో కొందరు కేసు పెట్టకుండానే ఆగిపోతున్నారని, మరికొందరు పోలీసులకు ఫి ర్యాదు చేస్తున్నారు. ఇలాంటి కేసులు రాష్ట్రవ్యాప్తంగా 150కిపైగా నమోదైనట్టు సమాచారం. డూప్లికేట్ క్యూఆర్ కోడ్ మోసాలకు పాల్పడేవారిలో కొందరు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని తమ యూ పీఐకి లింక్ అయిన ఫోన్ నంబర్ పూర్తిగా కనిపించకుండా జాగ్రత్త పడుతున్నట్టు పోలీసు లు గుర్తించారు. సైబర్ నిపుణులతో ఆ యా క్యూఆర్ కోడ్లను డీకోడ్ చేసి డబ్బులు వెళ్లిన అకౌంట్లు, వాటికి లింకైన ఫోన్ నంబర్ల వివరాలను తెలుసుకుంటున్నారు. ఆ వివరాలను తెలియజేసేందుకు కొన్ని బ్యాంకుల సిబ్బంది సహకరించపోవడంతో మోసగాళ్లను గుర్తించే ప్రక్రియ ఆలస్యమవుతున్నట్టు తెలుస్తున్నది.
ఈ మోసాలను నివారించేందుకు దుకాణాలు, రెస్టారెంట్లు, ఇతర వ్యాపార సముదాయాల్లో యూపీఐ పేమెంట్ల కోసం సౌండ్ బాక్స్తో కూడిన క్యూఆర్కోడ్లను వాడాలని పోలీసులు సూచిస్తున్నారు. షాపుల ముందు నాలుగైదు రకాల క్యూఆర్ కోడ్లను అతికించడం శ్రేయస్కరం కాదని హెచ్చరిస్తున్నారు. మోసగాళ్లను గుర్తించేందుకు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నారు.