హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): ఇంటర్ ఫస్టియర్ ప్రాక్టికల్ పరీక్షల సిలబస్పై ఇంటర్బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది పరీక్షలను 70శాతం సిలబస్కే నిర్వహించనున్నట్లు ప్రకటించింది. సెకండియర్లో మాత్రం వందశాతం సిలబస్ అమల్లో ఉంటుందని ఇంటర్బోర్డు కార్యదర్శి నవీన్మిట్టల్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇంటర్లో సైన్స్ గ్రూపులు, ఒకేషనల్ కోర్సుల్లోని విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహిస్తారు. ఫస్టియర్, సెకండియర్ ప్రాక్టికల్స్ కలిపి సెకండియర్లో ఒకేసారి నిర్వహిస్తారు. ఫస్టియర్లో ప్రాక్టికల్ పరీక్షలుండవు. అయితే కరోనాతో నిరుడు ఇంటర్ ఫస్టియర్లో 70శాతం సిలబస్ అమలు చేయగా, ఈ ఏడాది 100శాతం సిలబస్ను అమలు చేస్తున్నారు.
ఈ లెక్కన ఇప్పుడు సెకండియర్లో ఉన్న విద్యార్థులు ఫస్టియర్లో 70శాతం సిలబస్నే చదువుకొని పరీక్షలు రాశారు. ఇప్పుడు సెకండియర్లో ప్రాక్టికల్స్కు హాజరుకావాల్సిన నేపథ్యంలో 70శాతం సిలబస్ను చదువుకొన్న తామంతా ఇబ్బందులు పడతామని, 70శాతానికి కుదించాలని అధికారులను కోరారు. ఈ వినతులను పరిగణనలోకి తీసుకున్న ఇంటర్బోర్డు, 70శాతం సిలబస్కే పరిమితం చేసింది. తాజాగా వచ్చే నెలలో మొదలయ్యే రెగ్యులర్ పరీక్షలతో పాటు మే, జూన్లో నిర్వహించే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లోనూ ఫస్టియర్కు 70శాతం, సెకండియర్లో 100శాతం సిలబస్కే ప్రాక్టికల్ పరీక్షలను జరుపుతారు.
ప్రాక్టికల్ పరీక్షలిలా ఉంటే థియరీ పరీక్షలు మాత్రం 100శాతం సిలబస్కు జరుగుతాయి. ఫస్టియర్, సెకండియర్ రెండింటి థియరీ పరీక్షలను 100శాతం సిలబస్కే నిర్వహిస్తారు. నిరుడు ఫస్టియర్లో 70శాతం సిలబస్ చదివి కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన వారు సైతం ఈ ఏడాది 100శాతం సిలబస్ను చదవాల్సి ఉంటుందని ఇంటర్ బోర్డుకు చెందిన ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.
ఇంటర్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానున్నాయి. జనరల్, ఒకేషనల్ కోర్సుల్లోని సెకండియర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహించనుండగా, మార్చి 2వ తేదీతో ఈ పరీక్షలు ముగుస్తాయి. రోజు రెండు సెషన్లల్లో పరీక్షలు నిర్వహిస్తారు.