హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీలు జారీ చేసే అడ్వర్టయిజ్మెంట్లపై ఇంటర్ బోర్డు ప్రత్యేక నిఘా పెట్టింది. తప్పుడు ర్యాంకులతో విద్యార్థులను చేర్చుకొనే విధానానికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించి, ఐదుగురు ఉన్నతాధికారులతో పర్యవేక్షణ కమిటీని నియమించింది. ఇంటర్బోర్డు పరీక్షల నియంత్రణాధికారి, పరీక్షల విభాగం జాయింట్ సెక్రటరీ, పరిపాలన విభాగం జాయింట్ సెక్రటరీ, అకడమిక్స్ జాయింట్ సెక్రటరీ, పబ్లిక్ రిలేషన్స్ అధికారులతో కూడిన కమిటీని నియమిస్తూ సోమవారం ఇంటర్ బోర్డు కమిషనర్ నవీన్ మిట్టల్ ఉత్తర్వులిచ్చారు.
ఈ ఏడాది మార్చి 6న ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలతో ఎంసీఆర్హెచ్చార్డీలో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. విద్యార్థుల ఆత్మహత్యల నివారణ, కార్పొరేట్ కాలేజీలు తప్పుడు ర్యాంకులతో విద్యార్థులను మోసపుచ్చుతున్నాయన్న అంశంపై చర్చించారు. ఇందులో భాగంగా కాలేజీలిచ్చే అడ్వర్టయిజ్మెంట్లపై పర్యవేక్షణ జరపాలని సమావేశంలో నిర్ణయించారు.