హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం నడుస్తున్నది నైపుణ్యాల యుగం, స్టార్టప్ల కాలమే. డిగ్రీ లేదా బీటెక్ పూర్తికాగానే విద్యార్థుల్లో చాలా మంది స్టార్టప్స్, ఈ-కామర్స్ సంస్థలను స్థాపించేందుకు పోటీపడుతున్నారు. ఇలాం టి వారికి హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) నాలుగు కోర్సుల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నది.
40 గంటల వ్యవధి కలిగిన ఎంటర్ప్రెన్యూర్ లిటరసీ, బిజినెస్ లిటరసీ, డిజిటల్ లిటరసీ, బిహేవియరల్ స్కిల్స్లో శిక్షణకు ఔత్సాహికుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ప్రస్తుత విద్యార్థులతోపాటు ఫార్మసీ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ తదితర కాలేజీల్లోని పూర్వ విద్యార్థులు కూడా ఈ కోర్సుల్లో చేరవచ్చని తెలిపింది. ఇతర వివరాల కోసం https:// skillshub.isb.edu/sbtet/ వెబ్సైట్ను సంప్రదించాలని, ఇంకా ఏవైనా అనుమానాలుంటే skillshub@isb. edu ఈ-మెయిల్ ఐడీని సంప్రదించాలని అధికారులు సూచించారు.
జాబ్ మార్కెట్ రోజురోజుకూ వేగంగా మారుతున్నది. నైపుణ్యాల సాధనకు విద్యార్థులు నిరంతరం కృషిచేస్తూ ఉద్యోగాలకు సిద్ధమవ్వాలి. ఈ దిశగా విద్యార్థులు, నిరుద్యోగులను సాంకేతిక విద్యాశాఖ ప్రొత్సహిస్తుంది. సాంకేతిక విద్యామండలి ద్వారా ఐఎస్బీ అందించే కోర్సులు భవిష్యత్తును నిర్దేశిస్తాయి.
– నవీన్ మిట్టల్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్