Yadadri | యాదాద్రి భువనగిరి : పంచభూతాల సాక్షిగా, మూడు ముళ్లు.. ఏడుడగుల బంధంతో ఒక్కటైన జంట దాంపత్య జీవితం ఏడేండ్ల పాటు సాఫీగా సాగిపోయింది. ఈ దంపతులకు ఇద్దరు ఆడ పిల్లలు జన్మించారు. పెళ్లైన కొత్తలో ఉన్నంత అందం ఇప్పుడు లేదని.. భార్యను భర్త ఇంటి నుంచి గెంటేశాడు. దీంతో ఆవిడ.. తన భర్తపై పోరాటం చేస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన పన్నీరు రాజేశ్ అనే వ్యక్తికి ఏడేండ్ల క్రితం పూజ అనే అమ్మాయితో వివాహం జరిగింది. ఈ ఏడేండ్ల కాలంలో వారి సంసార జీవితం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లింది. ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. పిల్లల ఆలనా పాలన చూసుకునే సమయంలో తన భార్య అందంగా లేదని మరొకరితో ఉంటున్నాడు రాజేశ్. అంతేకాదు ఆ యువతిని నేరుగా ఇంటికి తీసుకొచ్చాడు. తన భర్త ప్రవర్తనతో విసుగు చెందిన పూజ.. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. అయినప్పటికీ ఆమెకు న్యాయం జరగలేదు.
ఈ క్రమంలో సోమవారం సాయంత్రం 6 గంటలకు తన ఇద్దరి పిల్లలతో ముత్తిరెడ్డిగూడెం చాడ రోడ్డుపై ముక్కుపచ్చలారని పసి పిల్లలపై పెట్రోల్ పోసి, తాను కూడా పెట్రోల్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న స్థానికులు సకాలంలో స్పందించడంతో ప్రాణం నష్టం జరుగలేదు. విషయం తెలుసుకున్న స్థానికులు పూజకు మద్దతు ప్రకటించారు. పూజకు, ఆమె పిల్లలకు న్యాయం జరిగే వరకు రోడ్డుపై నుండి కదిలే ప్రసక్తే లేదని ఊరంతా ఏకమైంది. ఇద్దరు ఆడపిల్లలు పన్నీరు యక్షశ్రీ(6), పన్నీరు హారిక(4).