నాగర్కర్నూల్ : మద్యం మత్తులో భార్య గొంతుకోసి(Cutting her throat) భర్త పరారైన సంఘటన నాగర్కర్నూల్ ( Nagarkurnool ) మండలం వనపట్ల గ్రామంలో గురువారం చోటు చేసుకున్నది. ఎస్ఐ గోవర్ధన్ కథనం మేరకు.. వనపట్లకు చెందిన భూషిపాగ రాములు, జ్యోతికి 20 ఏండ్ల కిందట వివాహం జరిగింది. కాగా, తాగుడుకు బానిసైన రాములు తరచూ భార్యతో గొడవ పడేవాడు. తాగుడు అలవాటు మానుకోవాలని రాములుకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకునేవాడు కాదు.
ఈ క్రమంలో గురువారం కూడా భార్యతో గొడవపడిన రాములు మద్యం మత్తులో కత్తిపీటతో(Knife) గొంతుకోసి పరారయ్యాడు. దీంతో జ్యోతి రక్తపు మడుగులో అక్కడికక్కడే మృతి చెందింది. కాగా, మృతురాలి ఇద్దరు కుమారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. తల్లి మృతితో పిల్లల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి.