హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): గతంలో ఏ సమస్య వచ్చినా కుటుంబం అండగా నిలిచేది. ఇప్పుడు కుటుంబమే సమస్యగా మారుతున్నది. కుటుంబ కలహాలతోనే అత్యధిక సంఖ్యలో (33.2 శాతం) ఆత్మహత్యలు జరుగుతున్నట్టు నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) 2021 నివేదిక వెల్లడిస్తున్నది. కుటుంబ వ్యవస్థలో వస్తున్న మార్పులు, చిన్నకుటుంబాల వ్యవస్థ, కుటుంబాల్లో చిన్నచిన్న అంశాలకు పరిష్కారం చూపే పెద్ద దిక్కులేకపోవడం వంటి అనేక అంశాలు కుటుంబసభ్యుల మధ్య అహంభావానికి, అపార్థాలకు కారణమవుతున్నాయి. ఫలితంగా కుటుంబసభ్యులు, కుటుంబంలోని సమస్యలే వారిని తనువు చాలించేలా చేస్తున్నాయని నివేదిక తేటతెల్లం చేసింది. అనారోగ్య సమస్యలు సైతం మరో ప్రధాన కారణంగా ఈ నివేదిక వెల్లడించింది. ఈ కారణంతోనే గతేడాది దేశవ్యాప్తంగా 18.6 శాతం మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. పరిణతిలేని వయసులో ప్రేమలు, కుల, మతాల వ్యత్యాసాలు సైతం ప్రేమికులకు మృత్యుపాశాన్ని విసురుతున్నాయి. 2021లో దేశవ్యాప్తంగా 1,64,033 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్టు ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది.
సోషల్ మీడియాలో గుర్తించడం లేదని..
ఆత్మహత్యలు చేసుకుంటున్న కారణాలు విశ్లేషిస్తే అనేక విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. 2021 ఎన్సీఆర్బీ రిపోర్టు ప్రకారం చూస్తే.. సోషల్ మీడియాలో తగిన గుర్తింపు ఉండటం లేదన్న కారణంతోనూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టు తెలుస్తున్నది. ఈ రకమైన ధోరణి యువతలో ఎక్కువగా ఉంటున్నది. ఇది సమాజానికి హెచ్చరికే.