నాంపల్లి కోర్టులు, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు అట్ల రాజశేఖరరెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా, మరో ప్రధాన నిందితుడైన పులిదిండి ప్రవీణ్కుమార్ బెయిల్ను తిరస్కరించింది. ఈ మేరకు నాంపల్లిలోని 12వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట శుక్రవారం నిందితుడు రాజశేఖర్రెడ్డి జమానత్ దాఖలు చేశాడు.
నిందితుడి తరఫున రూ.లక్ష చొప్పున ఇద్దరి పూచీకత్తుతో జమానత్ను కోర్టుకు సమర్పించాడు. విచారణ పూర్తయ్యే వరకు ప్రతీ సోమవారం సిట్ అధికారుల ఎదుట హాజరుకావాలని కోర్టు పేర్కొన్నది. ఈ కేసులో మరో ప్రధాన నిందితుడు పులిదిండి ప్రవీణ్కుమార్ బెయిల్ను తిరస్కరిస్తూ హైకోర్టు తీర్పు వెల్లడించింది. చార్జిషీట్ కాపీలను అందించి ఈ నెల 15న హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.