హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): అటవీ శాఖ భూములను ఆక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. అనంతగిరి రిజర్వ్ ఫారెస్ట్ పరిరక్షణలో భాగంగా అటవీ అధికారులు తమ చట్టబద్ధ విధులను నిర్వర్తించవచ్చని పేర్కొన్నది. అనంతగిరి రిజర్వ్ ఫారెస్ట్లోని వక్ఫ్ ఆస్తి స్వాధీనం, నిర్వహణలో అటవీ శాఖ జోక్యం చేసుకుంటున్నదంటూ మహ్మద్ ఫలియాజ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ విచారణలో ఈ అంశం వెలుగులోకి వచ్చింది.
అటవీ భూముల్లో ఆక్రమణలు, అనధికార కార్యకలాపాలు, చెత్త, నిర్మాణ వ్యర్థాలు, ఇతర వ్యర్థాల పారవేతను అడ్డుకొనే అధికారం అటవీ శాఖకు ఉన్నదని కోర్టు పేర్కొన్నది. అనంతగిరి రిజర్వ్ ఫారెస్ట్ను ఏపీ ఫారెస్ట్ యాక్ట్-1967లోని సెక్షన్-4 కింద 1970 జూలై 7న నోటిఫై చేసినట్టు అటవీ శాఖ తన కౌంటర్లో తెలిపింది. మొత్తం 3,718 ఎకరాలను రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటించగా, 368.09 ఎకరాల ఎన్క్లోజర్ను రిజర్వేషన్ నుంచి మినహాయించినట్టు వివరించింది.
ఈ ప్రాంతంలో మెడికల్ కాలేజీ, శ్రీఅనంత పద్మనాభస్వామి ఆలయం, సున్నీ మసీదు ఉస్మానియా, మదర్సా, యూసుఫైన్ ఓల్డ్ఏజ్ హోమ్ తదితర నిర్మాణాలు ఉన్నాయని తెలిపింది. చట్టబద్ధమైన స్వాధీ నం, మతపరమైన కార్యకలాపాల్లో తాము జోక్యం చేసుకోలేదని, రిజర్వ్ ఫారెస్ట్ పరిరక్షణ కోసమే తనిఖీలు, చర్యలు చేపట్టామని అటవీ శాఖ కోర్టుకు వివరించింది.