హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని బీజేపీ దద్దమ్మ ఎంపీల వల్లే కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ రావడం లేదని తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (రెడ్కో) చైర్మన్ వై సతీశ్రెడ్డి మండిపడ్డారు. తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఇచ్చే ప్రసక్తేలేదని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పార్లమెంట్లో ప్రకటించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు చట్టబద్ధంగా రావాల్సినవి ఇవ్వకుండా, విభజన చట్టంలోని అంశాలను పట్టించుకోకుండా కేంద్రంలోని మోదీ సరారు వివక్ష చూపుతున్నదని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో సతీశ్రెడ్డి పేర్కొన్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్కు, బీజేపీ పాలిత అస్సాంకు రైల్వే ప్రాజెక్టును ప్రకటించిన కేంద్రం తెలంగాణను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్రం నుంచి కేంద్రమంత్రి, ముగ్గురు ఎంపీలు ఉన్నా నిష్ప్రయోజనమని దుయ్యబట్టారు.