హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిధ్వనించింది. శుక్రవారం అసెంబ్లీలో తెలంగాణకు హరితహారంపై జరిగిన చర్చ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్రెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు పచ్చదనం పెంపుదలలో సంతోష్కుమార్ కృషిని ప్రశంసించారు. ఆయన పర్యావరణ అంబాసిడర్గా పనిచేస్తున్నారని కొనియాడారు. సీఎం కేసీఆర్ నుంచి స్ఫూర్తి పొందిన సంతోష్కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా హరిత భావజాల వ్యాప్తికి కృషి చేస్తున్నారని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అభినందించారు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు హరితయజ్ఞంలో భాగస్వాములను చేసిన ఘనత సంతోష్కుమార్కే దక్కుతుందని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేర్కొన్నారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్, క్రికెటర్ హనుమ విహారి తదితరులు గ్రీన్ ఇండియా చాలెంజ్పై చేసిన ట్వీట్లను ఆయన ప్రస్తావించారు. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ కూడా గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను ప్రశంసించారు. దీంతో అసెంబ్లీ రికార్డుల్లోనూ గ్రీన్ ఇండియా చాలెంజ్కు చోటు దక్కినట్టయ్యింది. అసెంబ్లీ లాబీల్లోనూ ఎమ్మెల్యేలు, జర్నలిస్టులు, పోలీసులు, అసెంబ్లీ సిబ్బంది దీనిపై చర్చించుకోవటం కనిపించింది.