Governor Tamilisai | స్పెషల్ టాస్క్ బ్యూరో, హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఈ 75 ఏండ్లలో తొలిసారి ఒక రాష్ట్ర అసెంబ్లీలో పెట్టాల్సిన బిల్లును రాష్ట్ర గవర్నర్ అడ్డుకొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు ఆమోదం తెలుపకుండా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తొక్కిపెట్టారు. ఈ చర్యద్వారా ఆమె ప్రభుత్వాన్ని లెక్కచేయకపోవటంతోపాటు అసెంబ్లీ హక్కులను కూడా తిరస్కరించినట్టు అయ్యిందని రాజ్యాంగ నిపుణులు చెప్తున్నారు. నిజానికి అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు క్యాబినెట్ ఆమోదించిన బిల్లును సభకు సమర్పించకుండా ఆపే అధికారం గవర్నర్కు లేదు. అందులోనూ ద్రవ్య బిల్లును ఆపే అధికారం అసలే లేదు. సాక్షాత్తూ రాష్ట్రపతికి కూడా ఈ అధికారం లేదు.
ఆర్థిక బిల్లుకు ఆమోదం తప్పనిసరి
రాజ్యాంగం ప్రకారం చట్టసభల్లో ప్రవేశపెట్టే బిల్లులు స్థూలంగా రెండు రకాలు. ద్రవ్య బిల్లులు, సాధారణ బిల్లులు. ఒకబిల్లు సాధారణ బిల్లా? ద్రవ్య బిల్లా అనేది పార్లమెంటులో లోక్సభ స్పీకర్, రాష్ర్టాల్లో శాసనసభ స్పీకర్ నిర్ణయిస్తారు. సాధారణ బిల్లులను క్యాబినెట్ ఆమోదించిన తర్వాత నేరుగా పార్లమెంటు, రాష్ర్టాల శాసనసభల్లో ప్రవేశపెట్టి, చర్చించి, ఆమోదించి, కేంద్రంలో అయితే రాష్ట్రపతికి, రాష్ర్టాల్లో గవర్నర్ ఆమోదానికి పంపుతారు. వీటిపై ఏవైనా అభ్యంతరాలుంటే పునఃపరిశీలించాలని రాష్ట్రపతి, గవర్నర్కు తిప్పిపంపే అధికారం ఉంటుంది. ద్రవ్య బిల్లు అలాకాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 110, 111 ప్రకారం ఒక బిల్లును ద్రవ్య బిల్లు అని లోక్సభ స్పీకర్ నిర్ణయించిన తర్వాత మొదట దానిని రాష్ట్రపతి ఆమోదానికి పంపుతారు. అయితే, ఈ బిల్లును సాధారణ బిల్లులాగా తిప్పిపంపే అధికారం రాష్ట్రపతికి లేదు. అయితే, ఇక్కడ గవర్నర్ల గురించి ప్రస్తావించలేదు. కేంద్రంలో, రాష్ర్టాల్లో ఒకేకరమైన రాజ్యాంగ వ్యవస్థ ఉన్నది కాబట్టి రాజ్యాంగ నిర్మాతలు ప్రత్యేకంగా ఆ అంశాన్ని చేర్చలేదు. కానీ, ద్రవ్య బిల్లు విషయంలో రాష్ట్రపతికి వర్తించే విధానమే గవర్నర్లకు కూడా వర్తిస్తుందని న్యాయ కోవిదులు చెప్తున్నారు. ఈ లెక్కన ఆర్టీసీ విలీన బిల్లును ఆపే అధికారం గవర్నర్కు లేదు. వెంటనే ఆమోదించాలన్న నిబంధన కూడా లేదు కదా అని రాజ్భవన్ వాదన. కానీ, ద్రవ్య బిల్లు క్యాబినెట్ ఆమోదించి పంపితే కాలయాపన లేకుండా రాష్ట్రపతి మోదించాలని రాజ్యాంగం చెప్తున్నది. దేశంలో ద్రవ్య బిల్లులను ఆపిన చరిత్ర కూడా ఎక్కడా లేదని నిపుణులు చెప్తున్నారు.
అసెంబ్లీ అధికారాలకూ దెబ్బ
గవర్నర్ తీరుతో అసెంబ్లీ అధికారాలు కూడా ప్రశ్నార్థకంగా మారాయి. భారత రాజ్యాంగం ప్రకారం చట్టాలు చేయలంలో కేంద్రంలో పార్లమెంటు, రాష్ర్టాల్లో అసెంబ్లీలే సుప్రీం. చట్టసభలు ఆమోదించిన బిల్లును ఒకసారికిపైగా తిప్పిపంపే అధికారం రాష్ట్రపతికి, గవర్నర్లకు లేదు. విధిగా వాటికి ఆమోదముద్ర వేయాల్సిందే. ఆ అధికారాలనే ఇప్పుడు గవర్నర్ తమిళిసై సవాల్ చేస్తున్నారని రాజ్యాంగవేత్తలు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఇది చెడు సంప్రదాయాలకు దారితీస్తుందని చెప్తున్నారు.