హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): వ్యవసాయానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతోపాటు ఆయా పంటల ఉత్పత్తులను కొనుగోలు చేయడంలోనూ తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తున్నది. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తూ వారికి అండగా నిలుస్తున్నది. పౌరసరఫరాల శాఖ ద్వారా ధాన్యం, మార్కెఫెడ్ ద్వారా మక్కజొన్న, జొన్న, కందులు, శనగల వంటి ఇతర పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నది. బహిరంగ మార్కెట్లో ధరలు పడిపోయిన సందర్భాల్లోనూ ప్రభుత్వం రైతులకు మద్దతు ధర చెల్లించి, వారు నష్టపోకుండా కాపాడుతున్నది. ప్రభుత్వానికి నష్టం వాటిల్లినా సరే.. రైతులకు నయా పైసా నష్టం రావొద్దన్న కృత నిశ్చయంతో సీఎం కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ యాసంగిలో ఇప్పటికే శనగలు, మక్కలు, సన్ఫ్లవర్ ఉత్పత్తుల కొనుగోలు కోసం మార్క్ఫెడ్కు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం తాజాగా జొన్నల కొనుగోలుకు కూడా ఆదేశాలు జారీ చేసింది.
యాసంగిలో ఇప్పటివరకు పౌరసరఫరాల శాఖ ద్వారా రైతుల నుంచి రూ.3,500 కోట్ల విలువైన 23 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. మార్క్ఫెడ్ ద్వారా రైతుల నుంచి సుమారు రూ.230 కోట్ల విలువైన పంట ఉత్పత్తులను కొనుగోలు చేసింది. ఇందులో దాదాపు 23 వేల మంది రైతుల నుంచి రూ.188 కోట్ల విలువైన 35,156 టన్నుల శనగలను కొనుగోలు చేసింది. మరో 1,700 మంది రైతుల నుంచి రూ.14 కోట్ల విలువైన 2 వేల టన్నుల సన్ఫ్లవర్ విత్తనాలను కొనుగోలు చేసింది. మక్కల కొనుగోలు కొనసాగుతున్నది. ఇప్పటివరకు సుమారు రూ.27 కోట్ల విలువైన 14 వేల టన్నుల మక్కలను మార్క్ఫెడ్ కొనుగోలు చేసింది. తద్వారా 3 వేల మంది రైతులకు ఉపశమనం లభించింది. సోమవారం నుంచి జొన్నల కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.
ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు పలు సందర్భాల్లో మార్కెట్లో డిమాండ్ లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు మొండి చేయి చూపిస్తున్నది. ఈ నేపథ్యంలో రైతుల కోసం నేనున్నా అంటూ సీఎం కేసీఆర్ ముందుకొస్తున్నారు. మార్కెట్లో పంటలకు మద్దతు ధర పడిపోయినప్పుడల్లా.. మార్క్ఫెడ్ను రంగంలోకి దింపి రైతులకు కొండంత అండగా నిలుస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ధర తక్కువ ఉన్నా.. రైతులకు మద్దతు ధర చెల్లించి పంటలు కొనుగోలు చేస్తుండటంతో మార్క్ఫెడ్కు నష్టాలు వాటిల్లుతున్నాయి. రాష్ట్రం ఏర్పాటు నుంచి ఇప్పటివరకు సుమారు రూ.2 వేల కోట్ల నష్టాన్ని భరించింది. ఒకవేళ ప్రభుత్వం ఇందుకు వెనుకాడి పంటలు కొనుగోలు చేయకపోతే ఆ నష్టం రైతులపై పడేది.
సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి. రైతులకు నష్టం, కష్టం రావొద్దనేదే ఆయన సంకల్పం. అందుకు మద్దతు ధర దక్కక రైతులు ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్నా.. ఆయా పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తున్నారు. ఇందుకు ఈ యాసంగిలో మక్కజొన్న, జొన్న, శనగలు, సన్ఫ్లవర్ కొనుగోళ్లే ఉదాహరణ. రైతులకు అండగా నిలిచిన సీఎం కేసీఆర్కు రాష్ట్ర రైతాంగం తరుపున కృతజ్ఞతలు.
– మార గంగారెడ్డి, మార్క్ఫెడ్ చైర్మన్